మాక్ ఎక్సర్సైజ్లు చేపట్టాలి
సూపర్బజార్(కొత్తగూడెం): అనుమతిలేని ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సీజ్ చేయాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ చట్టం, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై గురువారం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, స్కానింగ్ కేంద్రాలు, ల్యాబ్ల నిర్వహణ, అనుమతులు, నిబంధనల అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డయాగ్నస్టిక్ సెంటర్లు, స్కానింగ్ కేంద్రాలపై నిఘా ఉంచాలన్నారు. వైద్యశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీ సంస్థలో రిజిస్ట్రేషన్ పత్రాలు, అనుమతులు, అర్హత కలిగిన సిబ్బంది వివరాలు అందుబాటులో ఉంచాలన్నారు. అర్హతలు లేకుండా వైద్యం నిర్వహిస్తున్న ఆర్ఎంపీలపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, రెన్యూవల్ కోసం వచ్చిన 46 దరఖాస్తులను కమిటీ పరిశీలించింది.
ఈవీఎం గోదాం తనిఖీ
కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోదాంను కలెక్టర్ అంకిత్ గురువారం తనిఖీ చేశారు. సీసీ కెమెరాల నియంత్రణ గదిని, రికార్డింగ్ వ్యవస్థలను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఇతర అధికారులు డాక్టర్ తుకారాం రాథోడ్, మధు, సంజీవరావు, తిరుమలేష్, త్రినాథ్ బాబు, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, సతీష్ కుమార్, రంగా ప్రసాద్, శ్రీనివాసరావు, రాందాస్, హరీష్, నాగలక్ష్మి పాల్గొన్నారు.
జిల్లాలో వరదలు, అటవీ ప్రాంతాలలో సంభవించే ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి, విపత్తుల నిర్వహణకు సంబంధించి మాక్ ఎక్సర్సైజ్ల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ ఆధ్వర్యంలో గురువారం వరదలు, అటవీ ప్రమాదాల నియంత్రణపై హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, అటవీ శాఖాధికారి కృష్ణాగౌడ్ హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ఈనెల 18న సమగ్ర మాక్ ఎక్సర్ సైజ్ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
కలెక్టర్ అంకిత్


