టేకులపల్లి: మండలంలోని కొత్త తండా(పి)లో జరి గిన అగ్నిప్రమాదంతో పలువురు రైతులకు నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన రైతులు భూక్యా చీనా, ధరావతు చీనా గంగ ముత్యాలమ్మ ఆలయ సమీపంలో పంటలు సాగు చేస్తున్నారు. వీరి చేన్ల మీదుగా విద్యుత్ తీగలు వెళ్తుండగా, మంగళవారం గాలిదుమారానికి ఒకదానికొకటి రాసుకుని తెగిపడటంతో నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి భూక్యా చీనాకు చెందిన 25 క్వింటాళ్ల మొక్కజొన్న కంకులు, బోరు కేసింగ్ కాలిపోగా, ధరావతు చీనాకు చెందిన గడ్డివాము దగ్ధమైంది. లైన్లను సరిచేయాలని విద్యుత్ ఉద్యోగులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఈ విషయమై లైన్మెన్ దేవ్సింగ్ను వివరణ కోరగా సమస్య తమ దృష్టికి రాలేదని, ప్రమాదం ఎలా జరిగిందో పరిశీలిస్తామని తెలిపారు.


