బాపట్లటౌన్: మొబైల్ ఫోన్ల వాడకంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వరరావు సూచించారు. మొబైల్ఫోన్లను పోగొట్టుకున్న 251 మంది బాధితులకు సోమవారం ఫోన్లను అందజేశారు. వాటి విలువ రూ.50.20 లక్షలు ఉంటుందన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధితులతో సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు ఏడు విడతల్లో ఫోన్లను అందజేసినట్లు తెలిపారు. ఏడు విడతల్లో రూ.3,14,40,000 విలువైన 1572 మంది ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. ఫోన్ పోయినా, దొంగిలించబడినా ఆ సమాచారాన్ని తిరిగి పొందడం చాలా కష్టసాధ్యమవుతుందన్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బాపట్ల జిల్లాలో మొబైల్ ఫోన్లు రికవరీ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లలో ఇచ్చే ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోయిన ఫోన్లను వేగంగా రికవరీ చేస్తున్నామన్నారు. ప్రతి నెలా ‘మొబైల్ రికవరీ మేళా‘ నిర్వహించి బాధితులకు ఫోన్లను అందజేస్తున్నామన్నారు. గతంలో మొబైల్ రికవరీ శాతం 30 ఉండగా ప్రస్తుతం 72 శాతానికి పెంచడం జరిగిందన్నారు. 100 శాతం మొబైల్ ఫోన్ లను రికవరీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎల్.సుధాకర్, బాపట్ల డీఎస్పీ సిహెచ్.చంద్రమౌళి, సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్నాయక్, సోషల్మీడియా సెల్ ఇన్స్పెక్టర్ వి.సూర్యనారాయణ, ఎస్బీ సీఐ నారాయణ, ఐటీకోర్ టీమ్ ఎస్ఐలు నాగేశ్వరరావు, అనూషా, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


