బాపట్ల టౌన్ : నేరాల నియంత్రణపై ప్రత్యేక నిఘా ఉండాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లాలోని పోలీస్ అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... రౌడీ షీటర్లు, చెడు నడత కలిగిన వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచి, ఎటువంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో నేర నియంత్రణ, చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. వలస కార్మికుల ద్వారా గంజాయి సరఫరా అయ్యే అవకాశం ఉన్నందున వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అడిషనల్ ఎస్పీ ఎల్. సుధాకర్, చీరాల, రేపల్లె డీఎస్పీలు ఎండీ మొయిన్, షేక్ అబ్దుల్ అజీజ్, జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.


