బాపట్ల: అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు సకాలంలో మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పేర్కొన్నారు. వ్యవసాయం, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు, స్వయం సహాయక సంఘాలు, విద్య, గృహ నిర్మాణం తదితర రంగాలకు సంబంధించి సకాలంలో రుణాలు ఇవ్వాలన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని న్యూ కాన్ఫరెన్స్ హాల్లో జూన్ త్రైమాసికం, ఆర్థిక సంవత్సరం 2026–27కు సంబంధించి నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో బ్యాంకుల పనితీరు, రుణాల మంజూరు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి బాపట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో రూ.15,759.34 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యంగా నిర్దేశించినట్లు అధికారులు వివరించారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.10,992.17 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగానికి రూ.1,308.51 కోట్లు, మొత్తం ప్రాధాన్యతా రంగానికి రూ.12,691.78 కోట్లు లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని బ్యాంకర్లను ఆదేశించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకృష్ణ, యూబీఐ రీజనల్ హెడ్ డి.లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
‘22ఏ’ సమస్యలను పరిష్కరించాలి
జిల్లాలో 22–ఏ కేసులు, 1954కు ముందు ఉన్న నిషేధిత జాబితా భూముల సమస్యలను వెంటనే పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. డీఎల్ఎస్సీ సమావేశం మంగళవారం నిర్వహించారు. మొత్తం 14 అంశాలను పరిశీలించారు. నాలుగింటికి ఆమోదం తెలపగా, ఏడు అంశాలను తిరస్కరించారు. మరో మూడు అంశాలపై అదనపు నివేదికలు సమర్పించాలని సూచించారు. సమావేశంలో జేసీ భావన, డీఆర్వో లవన్న, ఏడీ సర్వేయర్ శేషగిరి, జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాస రావు, చీరాల ఆర్డీవో నరసింహారావు, బాపట్ల ఆర్డీవో హరికుమార్, ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ సతీష్, చిన్నగంజాం, చీరాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఎన్నికల విధులు బాధ్యతతో నిర్వహించాలి
ఎన్నికలకు సంబంధించిన విధులను అధికారులు బాధ్యతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ వీక్షణ సమావేశం మందిరంలో ఎన్నికలు, ప్రజా సమస్యల పరిష్కారం, స్థల సేకరణ, వాట్సాప్ గవర్నెన్స్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల గురించి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు వచ్చే దరఖాస్తులను అర్థం చేసుకొని సరైన పరిష్కారం చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో లవన్న, వీక్షణ సమావేశం ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వీఆర్వోలు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్


