కరుణామయురాలు తల్లి లూర్దుమాత
రెంటచింతల: కరుణామయురాలు తల్లి లూర్దుమాత అని దాచేపల్లి విచారణ గురువులు రెవ. ఫాదర్ ఏరువ బాల శౌర్రెడ్డి అన్నారు. స్థానిక కానుకమాత చర్చి 176వ తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా బుధవారం లూర్దుమాత మందిరంలో నిర్వహించిన నవదిన ప్రార్థనలలో సమష్టి దివ్యపూజాబలిని సమర్పించి, భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. లూర్దు మాత దేవుని తల్లిగా కొనియాడబడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు కుటుంబ ప్రార్థన చేసిన వారు ఆ తల్లి ఆశీస్సులు తప్పకుండా పొందుతారన్నారు. కానుకమాత చర్చి సహాయక గురువులు రెవ. ఫాదర్ ప్రసన్నకుమార్, కన్యసీ్త్రలు, చర్చి పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీబగళాముఖి అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా రాజశ్యామల నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. ఈ నెల 19వ తేదీన ప్రారంభమైన వేడుకలు బుధవారం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిశాయి. ఉదయం అమ్మవారికి కుంకుమ పూజలు, విశేష అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ కార్యనిర్వాహణాధికారి నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆలయ పండితులు రాజశ్యామల హోమం చేశారు. పూజాది కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహోత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్న సంతర్పణ చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చక్రధర్రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.
నరసరావుపేట రూరల్: పట్టణానికి చెందిన విద్యార్థి జాతీయ స్కూల్ గేమ్స్ పోటీలకు ఎంపిక య్యాడు. పట్టణంలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న షేక్ మహమ్మద్ నజీర్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలలో ప్రతిభ చూపి జాతీయ స్థాయి అండర్–19 షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 30వ తేదీ నుంచి ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో పోటీలు జరుగనున్నాయి. పోటీలో పాల్గొనేందుకు నజీర్ బయలుదేరి వెళ్లాడు. గతంలో రెండుసార్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలలో నజీర్ పాల్గొన్నాడు. అండర్–14,అండర్–17 విభాగాలలో జాతీయ స్థాయిలో ఆడాడు. బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–19 పోటీలలో రాష్ట్ర జట్టుకు నజీర్ ప్రాతినిధ్యం వహించాడు.
బాపట్ల: ప్రైవేటు వైద్యుల సేవల్లో నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాపట్ల డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టారు. చీరాల శంకర్ లాప్రోస్కోపీ అండ్ ఇన్ ఫెసిలిటీస్ హాస్పిటల్లో డెలివరీ నిమిత్తం ఇటీవల పి.సౌమ్య అనే మహిళ చేరగా వైద్యులు నిర్లక్ష్యం వలనే సౌమ్య చనిపోయిందని జిల్లా సీఐటీయూ అధ్యక్షులు ఎం.వసంతరావు పేర్కొన్నారు. ఇలాంటి వైద్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా వైద్యాధికారిణి డాక్టరు విజయమ్మ విచారణకు హామీ ఇవ్వటంతో ధర్నా విరమించారు. ఈ ధర్నాలో సీఐటీయూ కార్యదర్శులు సీహెచ్ ముసుందర్, ఎన్.బాబురావు, మహిళా సంఘం కార్యదర్శి సుభాషిణి, హైకోర్టు అడ్వకేట్ రజిని తదితరులు పాల్గొన్నారు.
కరుణామయురాలు తల్లి లూర్దుమాత


