
గంజాయి, డగ్స్ రవాణాపై ఉక్కుపాదం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్
బాపట్ల: జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలని జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో జిల్లాస్థాయి గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం బుధవారం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాలను సరఫరా చేసే వారిపై పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని చెప్పారు. ప్రభుత్వ కాలేజీల్లో గంజాయి తీసుకునే వారి వివరాలను సేకరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజల సహకారంతో గంజాయి సరఫరా చేసే వారిని పట్టుకోవాలని తెలిపారు. జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వారిపై దాడులు నిర్వహించి, వారికి అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు. గ్రామ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో గంజాయి విని యోగించే వారి వివరాలను గ్రామ సచివాలయ సిబ్బంది సేకరించాలని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1972 టోల్ ఫ్రీ నంబర్కు ప్రజలు కూడా ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. వివరాలను గోప్యంగా ఉంచుతాయని తెలిపారు. జిల్లాలోని నాలుగు లక్షల కుటుంబాలకు గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన తెలియజేసే వాల్పోస్టర్లు, కరపత్రాలు ప్రచురించి పంపిణీ చేయాలని ఆయన అధికారులు సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ విఠలేశ్వర్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరా, జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, జిల్లా రవాణాశాఖ అధికారి పరంధామరెడ్డి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
బంగారు కుటుంబాల అభ్యున్నతే లక్ష్యం
బంగారు కుటుంబాలను పేదరికం నుంచి బయటకి తెచ్చేలా మార్గదర్శులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. పీ–4 అమలుపై జిల్లా, మండల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన బుధవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో 62,291 బంగారు కుటుంబాలు ఉన్నాయని, వాటిని పేదరికం నుంచి బయటకు రావడానికి చేయూతనందించాలని ఆదేశించారు. పీ–4 అమలుకు జిల్లా, మండల, గ్రామస్థాయిలో కమిటీలు నియమిస్తామని పేర్కొన్నారు. ఒక్కో మండలంలో సుమారు 500 బంగారు కుటుంబాలు ఉన్నాయని, వీటిల్లో యువతకు నైపుణ్యాల అభివృద్ధిపై అవగాహన కల్పించాలని సూచించారు. పింఛన్ పంపిణీ ప్రక్రియ ముగిసిన తక్షణమే మిగిలిన నగదును ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పారు. సంతమాగులూరు మండలంలో రూ.6.41 లక్షలను ఎందుకు చెల్లించలేదని అధికారులను నిలదీశారు. బాపట్ల, బల్లికురవ, మార్టూరు, వేటపాలెం, నిజాంపట్నం మండలాలలోను నగదు పక్కదారి పడితే బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ సంబంధిత అధికారులను ప్రశ్నించారు. తక్షణమే బాధ్యులను సస్పెండ్ చేయాలని, వారిపై కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదుతో చార్జ్షీట్ పంపాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్గౌడ్, సీపీఓ కె. శ్రీనివాసరావు, డీఆర్డీ ఎఫ్సీ డి. శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
కలెక్టర్ జె.వెంకట మురళి