
పోరుమామిళ్ల: వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్లకు చెందిన షేక్ దర్వేష్ సాహెబ్ కేరళ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బక్రీద్ రోజున దర్వేష్ సాహెబ్కు ఉన్నత పదవి దక్కడంతో ఇక్కడ ఆయన బాల్య స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మా పిల్లలకు స్ఫూర్తి
పోరుమామిళ్లలో మాతో బాల్యంలో ఆటలాడిన స్నేహితుడు ఓ రాష్ట్రానికి అత్యున్నత పదవి అలంకరించడం నిజంగా మాకు గర్వకారణం. ఆయన మా పిల్లలకు స్ఫూర్తి. ఎప్పుడు సందర్భం వచ్చినా నేను మా పిల్లలకు దర్వేష్ గురించి చెపుతాను. అలా ఎదగాలని, ఆయనను స్పూర్తిగా తీసుకొని నడవాలని చెపుతుంటాను.
–గురుస్వామి, పాత్రికేయుడు, తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
నిజాయితీకి మారుపేరు
దర్వేష్ ఈ స్థాయికి చేరడం మాటల్లో చెప్పేది కాదు. పట్టుదల, నిజాయితీ, అనుకున్నది సాధించాలనే ధ్యేయం, నిర్మొహమాటం దర్వేష్ గుణాలు. అందుకే కేరళ ముఖ్యమంత్రి అయనను అభిమానించారు. స్నేహితులను ప్రేమించడం ఆయన తత్వం. కూతురు డాక్టర్ ఆయేషా అలియా, అల్లుడు మహమ్మద్, సైంటిస్ట్ జర్మనీలో ఉన్నారు.
–గొంగల్రెడ్డి శేషారెడ్డి, ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఛైర్మెన్, కడప
మాకు గర్వకారణం
పోరుమామిళ్లలో నాలుగు దశాబ్దాల క్రితం మాతో కలసి చదివిన దర్వేష్ ఓ రాష్ట్రంలో అత్యున్నత పదవి అలంకరించడం నిజంగా మాకు గర్వకారణం. అప్పట్లోనే దర్వేష్ ఎంతో చురుగ్గా ఉండేవాడు. ఎంతో నిజాయితీగా ఉంటాడు. పోరుమామిళ్లలో మా బ్యాచ్ అందరం ఏర్పాటు చేసుకున్న గెట్ టు గెదర్ ఫంక్షన్కు వచ్చి ఎంతో కలివిడిగా, ఆప్యాయంగా అందరితో కలసి పోయారు. మా ఇంటికి దగ్గరలోనే వారి ఇల్లు. హ్యాట్స్ ఆఫ్ దర్వేష్.
–మహమ్మద్ ఖాసీం, వ్యాపారి