
‘వన్ ఫైల్, వన్ లైఫ్’ నినాదంతో పనిచేయాలి
రాయచోటి: వన్ ఫైల్, వన్ లైఫ్ అనే నినాదంతో రెవెన్యూశాఖ పనిచేయాలని, పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి అంశంలో ముడిపడిన శాఖ రెవెన్యూ శాఖ అని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో శుక్రవారం రెవెన్యూ డే వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, డీఆర్ఓ మధుసూదన్ రావు, ఆర్డీఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ డే మీ అందరితో కలిసి జరుపుకోవడం చాలా సంతోషకరమని, అలాగే రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా మంచిగా పనిచేసి జిల్లాకు మంచి పేరు వచ్చే విధంగా భవిష్యత్తులో పనిచేయాలని కలెక్టర్ అన్నారు. రెవెన్యూ సిబ్బందికి ఏ పని అప్పచెప్పినా పూర్తిస్థాయిలో శ్రద్ధతో లక్ష్యాన్ని చేరుకునే విధంగా పని చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో ప్రభుత్వ పథకాల అమలు తీరులో చాలా పథకాలలో అన్నమయ్య జిల్లా మొదటి స్థానంలోఉండడం గర్వించదగ్గ విషయమన్నారు. అదే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలలో 60 నుండి 70 శాతం వరకు రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉంటాయన్నారు. ప్రజల నుండి వచ్చే రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖలో జాప్యం ఎక్కువగా ఉందన్న అపోహను తొలగించుకోవాలన్నారు. అందుకు టెక్నాలజీని ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు శిక్షణ పొంది ప్రజల సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్గించే విధంగా రెవెన్యూ శాఖ సిబ్బంది పనిచేయాలన్నారు. ఏ శాఖకు కష్టం వచ్చినా రెవెన్యూ శాఖ ముందు ఉంటుందన్నారు. రెవెన్యూశాఖ ఎంత పురాతనమైనది, ఏ విధంగా ఏర్పడింది, దాని ప్రాముఖ్యత, రికార్డులు నిర్వహణ సిబ్బంది పనితీరు, క్రమ శిక్షణ, సమాజంలో వారి ప్రాముఖ్యత, భూత భవిష్యత్తు, వర్తమానాలలో ఏ విధంగా విధులు నిర్వహించారనే విషయాలు, సలహాలు, సూచనలు జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ, రాయచోటి ఆర్డీఓ, రెవెన్యూ, రిటైర్డ్ ఉద్యోగులు తెలిపారు.
సీనియర్ ఉద్యోగులకు సన్మానం:
రెవెన్యూ డే సందర్భంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మదనపల్లి సబ్ కలెక్టర్లు, కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ ఉద్యోగులను, పదవీ విరమణ పొందిన రెవెన్యూ ఉద్యోగులను, ఉత్తమ సేవలు అందించి వివిధ హోదాలలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ప్రశంసా పత్రం, శాలువాలతో జిల్లా కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో రాయచోటి తహశీల్దార్ నరసింహ కుమార్, కలెక్టరేట్ ఉద్యోగులు, తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి అంశంలో ముడిపడిన శాఖ రెవెన్యూ శాఖ
జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఛామకూరి
కలెక్టరేట్లో ఘనంగా రెవెన్యూ డే వేడుకలు