
డిష్యుం...డిష్యుం..!
● ముష్టి ఘాతాలకు దిగిన తెలుగుతమ్ముళ్లు
● అక్రమ సంపాదనలో తేడాలు
● కడప ఎమ్మెల్యే ఇంట్లోనే పరస్పర దాడి
● సర్దిచెప్పిన జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప: అక్రమ సంపాదన వారి మధ్య వైరం పెంచింది. అధికారం అడ్డుగా పెట్టుకొని చేస్తున్న అక్రమ వ్యవహారాలు బెడిసికొట్టాయి. గత ప్రభుత్వ కాలంలో విపక్షంగా పోరాటం చేశాం, ఇప్పుడు స్వపక్షంలో ఉంటూ పోరాటం చేయాల్సి వస్తోందని మాటామాటా పెరిగింది. అంతే ఒక్కమారుగా ముష్టి ఘాతాలు పడ్డాయి. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి సాక్షిగా వారి సొంతత ఇంట్లో తెలుగుతమ్ముళ్లు పరస్పర దాడులు చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
కడప నగర కార్పొరేషన్లో 50డివిజన్లుకు 49 డివిజన్లు వైఎస్సార్సీపీ కై వసం చేసుకుంది. ఒకే ఒక్క డివిజన్తో తెలుగుదేశం పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా జనరల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోల్పోయింది. తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో 8మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిలో 8వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీదేవి అమె భర్త అండ్లూరు బాలకృష్ణారెడ్డి ఉన్నారు. అధికారం అడ్డుపెట్టుకొని సొమ్ము చేసుకోవాలనే తపనే వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకునేలా చేసిందని విశ్లేషకుల అంచనా. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరే వరకు టీడీపీ కోసం పనిచేసిన వారికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి వద్ద మంచి ప్రాధాన్యత లభించేది. ఎప్పుడైతే 8మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారో, అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నికల్లో కష్టపడ్డ వారికి ప్రాధాన్యత క్రమేపి తగ్గింది. ఈ క్రమంలో పాత, కొత్త తెలుగుతమ్ముళ్ల మధ్య తేడాలు వచ్చాయి. అక్రమ సంపాదనలో పోటీ పెరిగింది. ఒకరి ప్రయత్నంలో మరొకరి జోక్యం ఎక్కువైంది. ఆ క్రమంలో ఎప్పటి నుంచో ఉన్న ఆగ్రహావేశాలు ఒక్కమారుగా బహిర్గతమయ్యాయి. పాతకడప మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన అండ్లూరు బాలకృష్ణారెడ్డి ఒకరికొకరు నా వ్యవహారంలో నీ జోక్యం అనవసరమంటూ మాటలు పెట్టుకున్నారు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఆపై ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఇంట్లోనే పరస్పర ముష్టిఘాతాలకు పాల్పడ్డారు. వారిలో ఒకరికి గోడకు తగులుకొని స్వల్ప గాయమైనట్లు సమాచారం. పక్క రూములో ఉన్న జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇరువురికి సర్దిచెప్పాల్సి వచ్చింది. ఈమొత్తం వ్యవహారం అక్రమ కార్యకలాపాల నేపథ్యంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.