
ఆదాయం పెంచి అభివృద్ధికి కృషి చేయాలి
కురబలకోట: జిల్లాలోని పంచాయతీలు ఆదాయ వనరులను పెంపొందించుకుని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ సూచించారు. శుక్రవారం ఆమె మండలంలోని అంగళ్లులో పర్యటించారు. పారిశుద్ధ్య పనులను, సంపద తయరీ కేంద్రాలను పర్యవేక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కొత్తగా నిర్మించిన భవనాలకు పన్నులు విధించాలన్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు, అంగళ్లులో అక్రమంగా నిర్మించిన పీజీ హాస్టళ్లపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే అక్రమ భవనాలు నిర్మించిన వారికి నోటీసులు జారీ చేసి రెగ్యులర్ చేయకపోతే కూల్చి వేయాలన్నారు. కేంద్ర, రాష్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులపైనే ఆధారపడకుండా సొంత ఆదాయ వనరులను కూడా పంచాయతీలు పెంపొందించుకోవాలన్నారు. పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు. ఆస్తి పన్ను, పన్నేతర ఆదాయ వనరులు సక్రమంగా వసూలు చేయాలన్నారు. పన్నులతోనే పంచాయతీల అభివృద్ధి సాధ్యమని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రేడ్ల వారిగా పంచాయతీలను పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఆమె వెంట డీఎల్పీఓ నాగరాజు, డిప్యూటీ ఎంపీడీఓ అశ్విని, అంగళ్లు, కురబలకోట గ్రామ కార్యదర్శులు ఉదయ్ కుమార్, శేషగిరికుమార్ పాల్గొన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ