తాడేపల్లి: ఉండవల్లి స్టీల్ బ్రిడ్జిను వైఎస్సార్సీపీ నేతలు పరిశీలించారు. బకింగ్హామ్ కెనాల్పై నిర్మాణంలో ఉన్న స్టీల్ బ్రిడ్జిను వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, లేళ్ల అప్పిరెడ్డి, శైలజానాథ్లు పరిశీలించారు.

రాజధానిలోని సీడ్ యాక్సిస్ రోడ్కు అనుసంధానంగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. అయితే నిర్మాణ సమయంలో స్టీల్ బ్రిడ్జ్ గర్డర్ ఒరిగింది. దీన్ని పరిశీలించడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు.. రాజధాని పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకం అనడానికి ఇదొక నిదర్శమన్నారు.

పూటకో మాట చెప్తున్నారు..
బ్రిడ్జి నిర్మాణంలో అధికారులు పూటకో మాట చెప్తున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఉదయం తప్పులేదన్నారు, సాయంత్రానికి తప్పు జరిగినట్టు ప్రకటించారన్నారు. ‘రైతుల బాధలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అమరావతి పేరుతో విజయవాడను ఓల్డ్ సిటీగా మార్చేశారు. అప్పులు తెచ్చి అమరావతి అవసరమా?, అప్పులు ఆపండి, చిన్న బ్రిడ్జి నిర్మాణంలోనే ఇన్ని లోపాలు ఉంటే ఇక అమరావతి ఎప్పటికి అవుతుంది?, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు’ అని ధ్వజమెత్తారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ ఆర్నెళ్ల క్రితం ప్రారంభించిన బ్రిడ్జి ఇంకా పూర్తవలేదు. ఈలోపు కొంత కుంగిపోయింది. పనులు ఆపేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు వారధి దగ్గర కలుపుతామన్నారు. మరి స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ఎందుకు చేస్తున్నట్టు?, అంటే ప్లానింగ్ లోపం ఉన్నట్టా?, కొండవీటి వాగు మీద బ్రిడ్జి పూర్తి కాకుండానే బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జి నిర్మాణం ఎందుకు చేస్తున్నారు?, కమీషన్ల కక్కుర్తితో హడావుడిగా పనులు చేయటం వలనే బ్రిడ్జి కుంగింది.

బకింగ్హామ్ కెనాల్ జలరవాణాకు సంబంధించినది. దానిమీద బ్రిడ్జి నిర్మాణం చేయాలంటే చాలా పర్మిషన్ లు కావాలి. ఏం పర్మిషన్ లు తీసుకుని బ్రిడ్జి కడుతున్నారు?, అధికారం ఉందని ఇష్టానుసారం బ్రిడ్జిలు కడతారా?, చంద్రబాబు, లోకేష్, మంత్రి నారాయణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజాధనాన్ని కుంగిపోయే బ్రిడ్జిలకు ఖర్చు చేస్తారా?’ అని ప్రశ్నించారు.


