సాక్షి, తాడేపల్లి: దివంగత మహా నేత డాక్టర్ వైఎస్సార్కు వైఎస్సార్సీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం.. మిస్ యూ నాన్నా.. అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న ఫోటోలను వైఎస్ జగన్ పోస్టు చేశారు.
మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం!
Miss You Nana…#77thYSRJayanthi pic.twitter.com/roquXy3Xyy— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2026
దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి మహానేతకు అంజలి ఘటించారు. అనంతరం మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి మహానేతకు అంజలి ఘటించారు. పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, ఆరోగ్య సేవలు, విద్యావకాశాలు, సాగునీటి ప్రాజెక్టులు వంటి రంగాల్లో మహానేత డాక్టర్ వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని నేతలు పేర్కొన్నారు. ప్రజల కోసం ఆలోచించిన నాయకుడిగా, ప్రజల హృదయాల్లో నిలిచిన మహానేతగా వైఎస్సార్ ఎప్పటికీ స్ఫూర్తిదాయకుడని అన్నారు.


