Vivekananda Reddy Murder Case: Y.S. Avinash Reddy Comments On CBI - Sakshi
Sakshi News home page

సునీత అక్క స్టేట్‌మెంట్‌లో పలు అనుమానాలున్నాయి: అవినాష్‌రెడ్డి

Apr 25 2023 9:03 PM | Updated on Apr 26 2023 11:11 AM

Ys Avinash Reddy Comments On Cbi - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: వివేకా హత్య కేసులో తనను కుట్రపూరితంగా ఇరికిస్తున్నారని ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు. పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘కేసును ఛేదించే దానికంటే నన్ను ఇరికించడానికే సీబీఐ విచారణ జరుపుతోంది. నాలాంటి ఎంపీ స్థాయి వ్యక్తినే ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సునీత అక్క సీబీఐకు ఇచ్చిన మొదటి స్టేట్‌మెంట్‌కు తర్వాత ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు చాలా తేడాలున్నాయి. సునీత అక్క ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పలు అనుమానాలున్నాయి.’’ అని అవినాష్‌రెడ్డి అన్నారు.

‘‘హత్య జరిగిన రోజు నేను జమ్మలమడుగు వెళ్లేందుకు సిద్ధమయ్యాను. పులివెందుల రింగ్‌రోడ్‌ దగ్గరికి వెళ్లే సరికి నాకు శివప్రకాష్‌రెడ్డి నుంచి ఫోన్‌ వస్తే వచ్చాను. ​కానీ సీబీఐ ఈ కేసులో ఇంట్లో ఉన్నట్లు ఇరికించే ప్రయత్నం చేస్తోంది. నాతో పాటు వచ్చిన వారిని విచారిస్తే వాస్తవాలు తెలుస్తాయి’’ అని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.
చదవండి: వివేకా హత్య కేసు: కుట్రదారులతో కుమ్మక్కు 

‘‘హత్య జరిగిన రోజు విలువైన డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లినట్లు సీబీఐకి దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. సీబీఐ వాటిపై విచారించలేదు. ఉదయం లెటర్‌, సెల్‌ఫోన్‌ లభిస్తే దాచిపెట్టి సాయంత్రం పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో నిజాలు బయటకు రావాలని కోరుకుంటున్నా.. నేను ఎలాంటి తప్పు చేయలేదని చాలా నమ్మకంగా ఉన్నాను. మీడియా ఈ కేసు విషయంలో వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి. రేపు, ఎల్లుండి పులివెందులలో ఉంటాను’’ అని ఎంపీ అవినాష్‌రెడ్డి వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement