విషాదం: అమ్మకు తోడుగా వచ్చి.. 

Woman Dies Of Heart Attack In East Godavari - Sakshi

గుండెపోటుతో వివాహిత మృతి

తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చి మృత్యు ఒడిలోకి.. 

అల్లవరం: తండ్రి సంపాదించిన ఆస్తిని అమ్మకు చెందేలా అధికారుల నుంచి భరోసా కల్పించేందుకు, అమ్మకు తోడుగా వచ్చి తనువు చాలించిన సంఘటన అల్లవరంలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల కథనం ప్రకారం.. అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామానికి చెందిన పసలపూడి నాగమణి భర్త శ్రీరాములు ఏడాది క్రితం మృతి చెందారు. భర్త పేరిట ఉన్న ఆస్తిని తన తల్లికి చెందేలా నాగమణి కుమార్తె ద్రాక్షారామానికి చెందిన చెరుకు విజయలక్ష్మి(39) అల్లవరం తహసీల్దార్‌ కార్యాలయానికి వినతిపత్రం ఇచ్చేందుకు సోమవారం ఉదయం తల్లి నాగమణితో పాటు వచ్చారు.

తల్లి, కుమార్తెలు వినతిపత్రం తయారు చేసుకుని తహసీల్దార్‌ అప్పారావుకు ఇచ్చేందుకు వరండాలోని కురీ్చలో కూర్చున్నారు. ఇంతలో విజయలక్ష్మి కుర్చీలోని ముందుకు పడిపోయింది. కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది హుటాహుటిన పక్కనే ఉన్న సీహెచ్‌సీ ఆస్పత్రికి తరలించారు. సీహెచ్‌సీ వైద్యాధికారి శంకరరావు విజయలక్ష్మిని పరీక్షించగా అప్పటికే ఆమె మృతి చెందిందని నిర్ధారించారు. బెంగళూరులో ఉంటున్న విజయలక్ష్మి స్వగ్రామమైన ద్రాక్షారామంలో ఇటీవల తన కుమార్తెకు ఓణి పండుగ నిర్వహించి,  కొమరగిరిపట్నంలోని పుట్టింటికి ఆదివారం వచ్చింది. ఇంతలో కుమార్తె మృతి చెందడంతో మృతురాలి తల్లి నాగమణి కన్నీరుమున్నీరుగా విలపించింది. మృతురాలు భర్త బెంగళూరులో బ్యాంక్‌ ఉద్యోగి, మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామమైన ద్రాక్షారామం అంబులెన్స్‌లో తరలించారు.
చదవండి:
కదులుతున్న అవినీతి డొంక: ‘పచ్చ’నేతల గుండెల్లో రైళ్లు
‘డబ్బు ఇవ్వకుంటే పురుగుల మందు తాగుతాం’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top