అందంగా లేదని, బక్కగా ఉందని.. | Wife Protest In Front Of Husband House For Justice In Kurnool | Sakshi
Sakshi News home page

అందంగా లేదని, బక్కగా ఉందని..

Aug 5 2020 9:23 AM | Updated on Aug 5 2020 9:23 AM

Wife Protest In Front Of Husband House For Justice In Kurnool - Sakshi

భర్త ఇంటి సమీపంలో తల్లితో కలిసి దీక్ష చేస్తున్న బాధితురాలు మాధవి

సాక్షి, కర్నూలు : న్యాయం కోసం భర్త ఇంటి ఎదుట భార్య రెండు రోజులుగా దీక్ష చేస్తోంది. చినుకులకు తడుస్తూ రాత్రి సమయాల్లోనూ తల్లితో కలిసి అక్కడే నిద్రిస్తోంది. న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదని భీష్మించుకుకూర్చుంది. బాధితురాలు తెలిపిన వివరాలు.. కోడుమూరు మండలం వలుకూరు గ్రామానికి చెందిన ఈరమ్మ కూతురు మాధవిని వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామానికి చెందిన నాగమద్దయ్య, ఎల్లమ్మ కుమారుడు రామాంజనేయులుకు ఇచ్చి ఏడాది క్రితం వివాహం చేశారు. పెళ్లి సమయంలో ఎనిమిది తులాల బంగారం, రూ.లక్ష నగదు కట్నంగా ఇచ్చారు. ఆరు నెలల వరకు మాధవిని బాగా చూసుకున్న అత్తింటి వారు.. ఆ తర్వాత వేధింపులు ప్రారంభించారు.


మాధవి తల్లిపై కర్రతో దాడి చేస్తున్న అత్త

అందంగా లేదని, బక్కగా ఉందని భర్త రామాంజనేయులుతో పాటు అత్త ఎల్లమ్మ, మామ నాగమద్దయ్య పుట్టినింటికి తరిమేశారు. ఇరు కుటుంబాల పెద్దలు రాజీ చేసేందుకు యత్నించినా తమకు అమ్మాయి ఇష్టం లేదని తెగేసి చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి పలుమార్లు వెల్దుర్తి పోలీసులను కలిసి విన్నవించారు. అయినా న్యాయం జరగకపోవడంతో ఈనెల 3న తల్లి, మరో ఇద్దరు మహిళలతో కలిసి మాధవి రామళ్లకోటకు చేరుకుని భర్త ఇంటి ఎదుట దీక్షకు దిగింది. ఈక్రమంలో అత్త కర్రతో దాడికి దిగడంతో తల్లికి గాయమైంది. అయినా అక్కడే రెండు రోజులుగా దీక్ష కొనసాగిస్తున్నారు. ఇదే విషయమై ఏఎస్‌ఐ శివలింగం మాట్లాడుతూ ఇంతవరకు తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదన్నారు. ఇప్పటికైనా ఫిర్యాదు చేస్తే విచారించి న్యాయం చేస్తామని చెప్పారు.  (నాడు దానం చేసి.. నేడు క్షణమొక యుగంలా)

Advertisement
 
Advertisement
Advertisement