
వివాహేతర సంబంధానికి అడ్డున్నాడని ఘాతుకం
ఆరు గంటల వ్యవధిలోనే మిస్టరీని ఛేదించిన పోలీసులు
రాప్తాడు రూరల్ : 20 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న భర్తను కాదని.. రెండునెలల క్రితం పరిచయమైన ప్రియుడిపై ఓ మహిళ మోజు పెంచుకుంది. అది చివరకు భర్తను అంతమొందించేందుకు దారితీసింది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన ఆరు గంటల్లోనే అనంతపురం రూరల్ పోలీసులు మిస్టరీని ఛేదించారు. వివరాలివీ..అనంతపురం రూరల్ మండలం అక్కంపల్లి పంచాయతీ సదాశివకాలనీకి చెందిన కుమ్మర నరసాపురం సురేశ్బాబు (43), అనిత దంపతులు.
అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో సురేష్బాబు ఓ హోటల్ నిర్వహిస్తున్నాడు. భార్య అదే ప్రాంతంలోని ఓ హోటల్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో అనితకు రెండునెలల క్రితం ఆటోలో పండ్లు అమ్ముకునే బాబాఫకృద్దీన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది.
భర్తకు అనుమానం రావడంతో..
భార్య వ్యవహారశైలిపై ఇటీవల సురేశ్బాబుకు అనుమానం వచ్చింది. దీంతో మద్యం మత్తులో భార్యను వేధించడం ప్రారంభించాడు. తనను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని ప్రియుడికి అనిత వివరించింది. భర్తను కడతేరిస్తే ఇద్దరం సంతోషంగా ఉండొచ్చని ప్రియుడికి చెప్పింది. ఇద్దరూ కలిసి భర్త హత్యకు పథకం రచించారు.
ఈ క్రమంలో సురేశ్బాబు మంగళవారం రాత్రి 11 గంటలకు హోటల్ మూసేసి తన ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరాడు. అక్కంపల్లి–రాచానపల్లి మధ్య మాటువేసిన బాబాఫకృద్దీన్ ఖాళీ సీసాను సురేశ్బాబుపై విసిరాడు. దీంతో వాహనం అదుపుతప్పి కిందపడిన సురేశ్పై స్క్రూడ్రైవర్తో విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం ఓ పెద్ద బండరాయితో హతమార్చి ఉడాయించాడు.

భార్య తీరుపై అనుమానంతో..
ఈ ఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు, సీఐ శేఖర్, ఎస్ఐ రాంబాబు, సిబ్బంది వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. హతుడి భార్య అనితతో మాట్లాడారు. తన భర్త చాలా మంచివాడని ఎవరితోనూ గొడవల్లేవని ఎందుకు హత్యచేశారో తనకు తెలీదంటూ వాపోయింది. అయితే, ఆమె తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమె నడవడికపై ఆరా తీశారు. ఆ తర్వాత బాబాఫకృద్దీన్ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.