రేపటి నుంచి స్కూళ్లకు ఉపాధ్యాయులు 

Teachers to schools from tomorrow - Sakshi

సాక్షి, అమరావతి: పాఠశాలల పునఃప్రారంభం, మనబడి నాడు–నేడు, మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పాఠశాలల పునఃప్రారంభంపై చర్చలో జూలై 1 నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరయ్యేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. త్వరలో ఇందుకు సంబంధించిన విధివిధానాలు జారీ చేస్తామని అధికారులు తెలిపారు.

మధ్యాహ్న భోజనం పథకం అమలులో కుక్‌ కమ్‌ హెల్పర్ల వేతనాల పెండింగ్‌ అంశంపై మంత్రి అధికారులను అడిగారు. కొన్ని జిల్లాల్లో సీఎఫ్‌ఎంఎస్‌లో సాంకేతిక సమస్యలున్నాయని, మరికొన్ని జిల్లాలకు పేమెంట్‌ ప్రక్రియ పూర్తయిందని అధికారులు చెప్పారు. టాయిలెట్‌ మెయింటెనెన్సు ఫండ్‌ వినియోగం, శానిటేషన్‌ కోసం నియమించుకున్న ఆయాలకు చెల్లించాల్సిన వేతనాలు, సెలవు రోజుల్లో వారి సేవలు ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై కూడా త్వరగా విధివిధానాలు తయారు చేయాలని మంత్రి సురేష్‌ అధికారులకు సూచించారు. పాఠశాల విద్య ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి.రాజశేఖర్, డైరెక్టర్‌ వి.చినవీరభద్రుడు, ఎస్పీడీ వెట్రిసెల్వి, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్‌ దివాన్‌ పాల్గొన్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top