
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తెలుగు దేశం పార్టీ మహానాడు(TDP Mahanadu) కార్యక్రమం మాటేమోగానీ.. జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు జనాల్ని తరలించలేక, సభకు వచ్చినవాళ్లను నిలువరించలేక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. తొలిరెండు రోజులు ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం, నేతలు మాట్లాడుతుండగానే మధ్యలో జనాలు వెళ్లిపోవడాన్ని సాక్షి హైలైట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మూడోరోజు మహానాడు బహిరంగ సభనైనా జనంతో నింపేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో..
మహానాడు సభ కోసం ఆర్టీసీ నుంచి భారీగా టీడీపీ బస్సులను వినియోగించుకుంటోంది. చాలా గ్రామాలకు ఉదయమే బస్సులు చేరుకుని జనాల్ని తరలిస్తున్నాయి. దీంతో డిపోల్లో బస్సుల్లేక.. సరిపడా బస్సుల్లేక గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణికులు అగచాట్లు పడుతున్నారు. చాలా బస్టాండుల్లో బస్సుల్లేవ్ అనే బోర్డులు సైతం దర్శనమిస్తుండడం గమనార్హం. నంద్యాల జిల్లా నుంచి, శ్రీశైలం నుంచి మహానాడు కోసం బస్సులు తరలించారు. ఆత్మకూరు డిపోలో బస్సుల్లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.



మరోవైపు.. కడప మహానాడు (Kadapa Mahanadu)ను ఎలాగైనా ‘సక్సెస్’ చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి జనసేకరణ చేపట్టింది. అన్నమయ్య జిల్లాలో మహానాడు కోసం ఓబులవారిపల్లి హరిజన వాడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే.. అది బలవంతపు తరలింపు అని ఇప్పుడు తేలింది. డ్వాక్రా మహిళలు మహానాడుకు కచ్చితంగా రావాలని, సమావేశానికి రాకపోతే లోన్లు ఇవ్వమంటూ బెదిరించిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది.

మహానాడు కారణంగా చివరకు పోలీసులు(AP Police) సైతం పడుతున్న కష్టాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయించుకుంది టీడీపీ. అయితే కనీసం తిండి కూడా పెట్టడం లేదంటూ ఓ ఎస్సై పడిన ఆవేదన వీడియో రూపేణా బయటకు వచ్చింది. మహానాడులో రకరకాల రుచులతో భోజనాలు ఘనంగా పెడుతున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా ఎంతలా ప్రచారం చేసుకుందో తెలిసిందే. కానీ, తాము ఏ పూట వెళ్లినా తమకు తిండి మాత్రం దొరకడం లేదని ఆయన అక్కడికి వచ్చిన వాళ్లకు చెప్పుకుంటూ వాపోయారు.
ఇదీ చదవండి: మహానాడులో ఎన్టీఆర్ స్పీచ్.. నవ్వుకున్న టీడీపీ కార్యకర్తలు