
ఏది రాజకీయం.. చేయించిందెవరు?
పెదపెంకి పిల్లల ప్రమాద ఘటనను ‘డైవర్షన్’ చేసేందుకు ప్రయత్నం
మంత్రి లోకేశ్కు ‘ఎక్స్’లో పోస్టు చేసింది టీడీపీ కార్యకర్త శ్యామ్
ఎమ్మెల్యే విజయచంద్రకు అనుచరుడిగా గుర్తింపు
వాస్తవాలు బయటకు రావడంతో ‘తప్పు’ను కప్పిపుచ్చే యత్నం
సాక్షి, పార్వతీపురం మన్యం: కలెక్టరేట్ వద్ద గత సోమవారం బలిజిపేట మండలం పెదపెంకి ఎంపీపీ–1 పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేపట్టిన నిరసనకు కూటమి నాయకులు రాజకీయాలు అద్దేందుకు విఫలయత్నం చేస్తున్నారు. తమ పాఠశాల నుంచి 3, 4, 5 తరగతులను మరోచోటకు విలీనం చేయవద్దని జూన్ 12వ తేదీ నుంచి విద్యార్థులు పోరాటం చేస్తూనే ఉన్నారు. పిల్లలను బడులకు కూడా తల్లిదండ్రులు పంపడం లేదు. వారి సమస్య పరిష్కారంపై ఎవరూ స్పందిలేదు. ఇప్పటికే దఫదఫాలుగా ఆందోళన చేస్తున్న వారు ఈ నెల 23న పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే జోగారావుకు సమస్యను వివరించి, వినతిపత్రం అందజేశారు. తిరుగు ప్రయాణంలో వారు వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. కొంతమంది విద్యార్థులు గాయపడ్డారు. వాస్తవంగా జరిగింది ఇదీ.. దీన్ని రాజకీయం చేసి, మాజీ ఎమ్మెల్యే జోగారావునే పిల్లలను ధర్నాకు తీసుకొచ్చినట్లు కూటమి నాయకులు ప్రచారానికి ఎత్తుకున్నారు.
మంత్రి లోకేశ్కు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది ఎవరు?
జరిగిన ఘటనను పూర్తిగా వక్రీకరిస్తూ.. మాజీ ఎమ్మెల్యేనే బాధ్యుడిని చేస్తూ.. పాఠశాల సమయంలో నిర్లక్ష్యంగా వ్యహరించిన హెచ్ఎం, ఎంఈవోలపై చర్యలు తీసుకోవాలని శ్యామ్ అనే వ్యక్తి.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’లో పోస్టు చేశాడు. ఈ శ్యామ్ అనే వ్యక్తి పక్కా టీడీపీ కార్యకర్త. పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్రకు అనుచరుడు. సోషల్ మీడియా ఖాతాలనూ అతనే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేతో పాటు.. మంత్రి లోకేశ్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోనూ పలు సందర్భాల్లో ఫొటోలు దిగాడు. ఒక టీడీపీ కార్యకర్త.. వాస్తవాలను వక్రీకరిస్తూ, పోస్టులు పెట్టగానే చర్యలకు ఆదేశాలివ్వడం, నిర్ధారణ చేసేయడం గమనార్హం. టీడీపీ వారు ఏది చెబితే అదే రాజ్యాంగమా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ రాజకీయమే అందామా?
ఆటో ప్రమాద ఘటనలో గాయపడిన చిన్నారులకు ఆర్థిక సహాయం నిమిత్తం టీడీపీ నాయకులు బుధవారం ఆస్పత్రికి వెళ్లి మరీ ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున నగదు అందించారు. కొద్ది రోజులుగా పిల్లలు పోరాటం చేస్తున్నా, తమకేమీ తెలియదన్నట్లు చెబుతున్న తెలుగుదేశం పార్టీ పెద్దలు.. వారి సమస్య వినే తీరిక లేని నేతలు.. పిల్లలకు ప్రమాదం జరిగితే పరామర్శ చేయడం, ఆర్థిక సాయం అందించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మానవతాదృక్పథంతో ఆ మొత్తం ఇచ్చారా.. లేకుంటే తాము వేసిన స్కెచ్ పారలేదనీ.. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి తల్లిదండ్రులను మభ్యపెట్టడానికే ఇచ్చారా.. దీన్నీ రాజకీయమే అనుకోవాలా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యే సొంత గ్రామమైన నర్సిపురంలో ప్రమాదం జరిగితే.. ఏ ఒక్కరైనా ఎందుకు పరామర్శకు వెళ్లలేదని, ఇప్పుడే ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు.
దయచేసి రాజకీయాలు చేయొద్దు..
మా పిల్లల భవిష్యత్తు కోసం స్వచ్ఛందంగానే గత సోమవారం ధర్నాకు వచ్చాం. ఇందులో ఎవరి ప్రమేయమూ, ఒత్తిడి లేదు. దయచేసి ఎవరూ ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దు. వీలైతే పాఠశాలను తరలించకుండా చూడండి. – సంతో‹Ù, విద్యార్థి తండ్రి
మంత్రిని మభ్యపెట్టిన ఎమ్మెల్యే?
తమను ఎవరూ పిలవలేదని.. పిల్లల పాఠశాల సమస్యపై తామే స్వచ్ఛందంగా వచ్చామని ఇప్పటికీ సంబంధిత పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆటో ప్రమాద ఘటన దురదృష్టవశాత్తు జరిగిందే గానీ.. ఇందులో ఎవరి ప్రమేయమూ లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయంలో టీడీపీ నేతలు అత్యుత్సాహానికి పోయి, స్వయానా మంత్రి లోకేశ్ను మభ్యపెట్టి, సామాజిక మాధ్యమాల్లో తమ అనుచరునితో పోస్టులు పెట్టించి, డైవర్షన్ పాలిటిక్స్కు తెర తీయడం విమర్శలకు తావిస్తోంది. తన అనుచరుని నిర్వాకాన్ని దాచిపెట్టి.. హడావిడిగా స్థానిక ఎమ్మెల్యే సైతం.. మాజీ ఎమ్మెల్యేనే నిందిస్తూ, ప్రకటన జారీ చేయడం గమనార్హం.
ఏం జరుగుతోంది...
ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత బుధవారం పోలీసులు ఆస్పత్రికి వెళ్లి బాధితులతో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. అంటే.. ఈ ఘటనపై ఇప్పటి వరకూ పోలీసులు వివరాలేవీ సేకరించలేదా, లేకుంటే ఎవరి ఒత్తిడైనా ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు రోజు కూడా పాఠశాలకు వెళ్లిన అధికారులు విచారణ చేపట్టారు. పిల్లల భవిష్యత్తుపైనా రాజకీయాలకు ముడిపెట్టి, తమ స్వప్రయోజనాల కోసం కూటమి నాయ కులు చేస్తున్న ప్రయత్నాలపై తల్లిదండ్రుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.