తాటి.. పోషకాల్లో మేటి | Special Story Rampachodavaram Palm Researches | Sakshi
Sakshi News home page

తాటి పోషకాల్లో మేటి.. తాటి బెల్లం మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో ఇక్కడ!

Aug 26 2022 8:06 AM | Updated on Aug 26 2022 12:12 PM

Special Story Rampachodavaram Palm Researches - Sakshi

తాటికి సంబంధించి అందరికీ తెలిసింది తాటి బెల్లం మాత్రమే..

రంపచోడవరంలో డాక్టర్‌ వైఎస్సార్‌ హార్టికల్చర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌లో ‘తాటి’పై జరుగుతున్న పరిశోధనలు సత్పలితాలనిస్తున్నాయి. అఖిల భారత తాటి సమన్వయ పరిశోధన పథకంలో భాగంగా 1993 నుంచి చేపట్టిన పరిశోధనల ద్వారా తాటి నీరా(అప్పుడే తీసిన తాటి కల్లు)తో అనేక ఉత్పత్తులు తయారు చేయవచ్చని నిరూపించారు.

సాధారణంగా తాటికి సంబంధించి అందరికీ తెలిసింది తాటి బెల్లం మాత్రమే. అయితే హార్టికల్చర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సీవీ వెంగయ్య తన ప్రయోగాలతో తాటి ద్వారా అనేక పదార్థాలు తయారు చేయవచ్చని నిరూపించారు. ఈ మేరకు ఐసీఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రీసెర్చ్‌)కు తన ప్రయోగ ఫలితాలను సమర్పించారు. ఏజెన్సీలో గిరిజనులకు తాటి చెట్ల ద్వారా ఆదాయం సమకూర్చాలనే లక్ష్యంతో ఈ పరిశోధనలు చేసినట్లు వెంగయ్య తెలిపారు.  


తాటి తాండ్ర తయారీ ఇలా.. 

1993 నుంచి తాటిపై పరిశోధనలు 
భారతదేశంలో తాటిపై పరిశోధనలు సాగిస్తున్న రీసెర్చ్‌ స్టేషన్‌ పందిరిమామిడిలోనే ఉంది. 1993 నుంచి ఇప్పటి వరకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ 270 రకాల తాటి చెట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల తాటి చెట్లు ఉంటాయని ఒక అంచనా. 2019 సంవత్సరంలో తాటి కల్లు నుంచి నీరా(హెల్త్‌ డ్రింక్‌) తయారు చేసే యూనిట్‌ను నెలకొల్పారు. దీని ద్వారా తాటి నుంచి కల్లు సేకరించి నీరా తయారు చేస్తారు. జనవరి నుంచి నీరా తయారీ ప్రారంభమవుతుంది.

ప్రస్తుతం తాటి పండ్లు నుంచి గుజ్జును సేకరించి తాటి తాండ్రను తయారు చేసి విక్రయిస్తున్నారు. తాటి గుజ్జును సేకరించేందుకు ఒక యంత్రాన్ని కూడా ఇక్కడ అభివృద్ధి చేశారు. తాటి పండ్లు, తాటి తేగలు, తాటి కల్లు ద్వారా తాటి బెల్లం, జెల్లీ, నూక, పిండి, సిరప్‌లు, తాండ్ర తయారు చేస్తున్నారు. తాటికి సంబంధించి తెలంగాణ, బిహార్, తమిళనాడుకు చెందిన అనేక మంది రైతులు హెచ్‌ఆర్‌సీ వచ్చి శిక్షణ పొందుతున్నారు.  


తాటి తాండ్ర

డీఎస్‌టీకి ప్రతిపాదనలు  
గ్రామస్థాయిలో తాటి ఉత్పత్తులు తయారీపై శిక్షణ ఇచ్చేందుకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి ప్రతిపాదనలు పంపించాం. టీఎస్‌పీ నిధులు రూ.కోటి కేటాయించాలని కోరాం. గ్రామస్థాయిలో శిక్షణ ఇస్తే తాటిపండ్ల వినియోగం పెరుగుతుంది. ప్రస్తుతం మనకు లభిస్తున్న తాటి చెట్లు నుంచి 2 శాతం మాత్రమే వినియోగించుకుంటున్నాం.  
:::సీవీ వెంగయ్య, శాస్త్రవేత్త, ఫుడ్‌ అండ్‌ టెక్నాలజీ, హెచ్‌ఆర్‌ఎస్, పందిరిమామిడి


తాటి బెల్లం


తాటి సిరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement