Anandayya Eyedrops Is Harmful To Eyes: AP Govt Submit Report To HC - Sakshi
Sakshi News home page

ఆనందయ్య ఐ డ్రాప్స్‌తో కళ్లకు హాని 

Jun 22 2021 4:57 AM | Updated on Jun 22 2021 4:19 PM

Report says Anandaiahs Eye Drops Harmful: Govt To High Court  - Sakshi

సాక్షి, అమరావతి: ఆనందయ్య ఐ డ్రాప్స్‌ (కంటి మందు)లో హానికర పదార్థాలున్నట్లు పరీక్షల్లో తేలిందని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు తెలిపింది. దీని వినియోగం వల్ల కళ్లకు హాని కలుగుతుందంటూ నివేదికలు వచ్చాయని వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఆ పరీక్షలకు సంబంధించిన నివేదికలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. వివరాలు.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన బి.ఆనందయ్య కరోనా చికిత్సకు నాలుగు రకాల మందులు, ఐ డ్రాప్స్‌ తయారు చేశారు. ఈ మందుల వినియోగానికి అనుమతినిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆనందయ్యతో పాటు మరికొందరు గతంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఐ డ్రాప్స్‌ మినహా మిగిలిన 4 రకాల మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని పరీక్షల్లో తేలడంతో.. ప్రభుత్వం వాటి వినియోగానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఐ డ్రాప్స్‌పై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ప్రముఖ సంస్థల నివేదికల ఆధారంగానే.. 
ఈ వ్యాజ్యాలు సోమవారం విచారణకు రాగా.. ప్రభుత్వం తరఫు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్‌ స్పందిస్తూ, ఐ డ్రాప్స్‌ శాంపిళ్లను ఐదు సంస్థలకు పంపించామని చెప్పారు. కంటి చికిత్స రంగంలో ఎంతో పేరున్న ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్, శంకర నేత్రాలయ సంస్థలు నివేదికలిచ్చాయని తెలిపారు. ఆనందయ్య ఐ డ్రాప్స్‌లో హానికర పదార్థాలున్నట్లు ఆ నివేదికల్లో పేర్కొన్నాయని వెల్లడించారు. వాటి వినియోగం వల్ల కళ్లకు ప్రమాదం కలుగుతుందని చెప్పాయన్నారు. ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ జోక్యం చేసుకుంటూ.. ఐ డ్రాప్స్‌ వల్ల దుష్ప్రభావాలు ఉండవని తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కాలేజీ చెప్పిందన్నారు. ఈ మందు వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని హామీ కూడా ఇస్తామన్నారు. ముందు ఐ డ్రాప్స్‌ విషయంలో ప్రభుత్వ నివేదికలను పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. పరీక్ష ఫలితాల నివేదికలను కోర్టు ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement