కాకినాడ: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలకంగా భావించిన పెంపుడు కుక్క మృతిపై దర్యాప్తు చేపట్టారు అధికారులు. ఈ క్రమంలోనే నిన్న(శనివారం, జూన్ 13వ తేదీ) మృతి చెందిన కుక్కకు.. ఈరోజు(ఆదివారం, జూన్ 14వ తేదీ) పోస్టుమార్టం నిర్వహించారు. ఎన్.సూరవరం వెటర్నరీ అధికారుల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించారు.
కుక్కకు పోస్టుమార్టం నిర్ర్వహించిన అనంతరం నమూనాలను సేకరించి విశాఖ వరుణ్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. దాంతో ల్యాబ్ నివేదికపై ఉత్కంఠ నెలకొంది. సహజ మరణమా..? విష ప్రయోగమా? అనేది ల్యాబ్ రిపోర్ట్ అనంతరం తేలనుంది.
కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని చిక్కుళ్ల అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో క్లూ అనుకున్న కుక్క మృతిచెందడంతో ఇప్పుడు టాపిక్ అంతా కుక్కపైకి డైవర్ట్ అయ్యింది. చిన్నారి ఆచూకీని కనిపెట్టడానికి అడవులు, కొండల్ని కొన్ని రోజులుగా జల్లెడ పట్టిన కుక్క. తిరిగి ఇంటికొచ్చిన తర్వాత మృత్యువాత పడింది. ఇంటికొచ్చిన తర్వాత ఆ పెంపుడు కుక్క వింతగా ప్రవర్తిస్తూ చివరకు మృతిచెందింది.



