Perupalem Beach: అప్పుడు వైఎస్‌.. ఇప్పుడు జగన్‌   

Perupalem Beach: Best Tourism Spot in West Godavari - Sakshi

గతేడాది బీచ్‌ ఫెస్టివల్‌తో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు 

కేంద్ర ప్రభుత్వ బ్లూఫాగ్‌ గుర్తింపునకు ప్రయత్నాలు  

బీచ్‌లో కొత్తగా రిసార్టుల నిర్మాణం

సాక్షి, నరసాపురం: జిల్లాలో ఆహ్లాదానికి, ప్రకృతి రమణీయతకు ఆలవాలం పేరుపాలెం బీచ్‌.. ఏ ఇతర బీచ్‌లకు కూడా తీసిపోని కనువిందు చేసే దృశ్యాలు పేరుపాలెం సొంతం. తీరం పొడవునా కొబ్బరి చెట్లు, మతసామరస్యానికి ప్రతీకగా వివిధ ఆలయాలు ప్రత్యేక ఆకర్షణ. తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్‌ సర్టిఫికెట్‌ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్‌ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్‌ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది.  

పేరుపాలెం బీచ్‌ సోయగం వర్ణించడానికి మాటలు చాలవు. అయితే అనుకున్నంత ప్రచారం లేకపోవడం, మౌలిక వసతుల లేమితో ఆశించినంత అభివృద్ధికి నోచుకోకుండా పోయింది. అయితే ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గద్దెనెక్కిన తొలినాళ్లలోనే పర్యాటకరంగం అభివృద్ధిపై దృష్టిపెట్టారు. ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చొరవతో 2020 ఫిబ్రవరి 15, 16 తేదీల్లో  పర్యాటకశాఖ ఆధ్వర్యంలో  పేరుపాలెంలో బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. జిల్లాలో పర్యాటకరంగం అభివృద్ధికి బాటలు వేయడానికి ఈ వేడుక ఉపయోగపడింది. బీచ్‌ అభివృద్ధికి ప్రస్తుతం వడివడిగా అడుగులు పడుతున్నాయి. కరోనా కల్లోలం లేకపోతే ఇప్పటికే బీచ్‌ మరింత అభివృద్ధి చెందేది.  

చదవండి: (కోస్టల్‌ బ్యూటీ.. విశాఖ అందాలపై ప్రత్యేక కథనం)

వేగంగా రిసార్టుల నిర్మాణాలు 
పేరుపాలెం, కేపీపాలెం బీచ్‌లను అభివృద్ది చేసేందుకు ఏడాది క్రితమే ప్రయత్నాలు ప్రారంభమయ్యియి. పర్యాటకుల వసతి కోసం లగ్జరీ హోటల్‌ నిర్మాణానికి ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే కొన్ని రిసార్టులు నిర్మించారు. మరికొన్ని రిసార్టులతో పాటు స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలని ప్రతిపాదనలు పంపడడంతో ప్రభుత్వం  అంగీకరించింది. ఇటీవల టూరిజం శాఖ రీజనల్‌ డైరక్టర్‌ తీరప్రాంతంలో పర్యటించి నిర్మాణాలకు అనువైన స్థలాలు గుర్తించారు. ఇప్పటికే పేరుపాలెం బీచ్‌ నుంచి కేపీపాలెం బీచ్‌ వరకు ఉన్న 3.5 కిలోమీటర్ల రహదారిని డబుల్‌ రోడ్‌గా విస్తరిస్తూ పనులు ప్రారంభించారు. రూ 8. కోట్లతో ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 


బీచ్‌లో రిసార్ట్స్‌  

బ్లూఫాగ్‌ గుర్తింపుతో మరింత అభివృద్ధి  
ఇటీవల కేంద్ర ప్రభుత్వం నియమించిన బ్లూఫాగ్‌ బృందం తీరంలో పర్యటించింది. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఈ బీచ్‌ అనుకూలంగా ఉందని బృందం నివేదిక ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్లూఫాగ్‌ సర్టిఫికేషన్‌పై దృష్టిపెట్టింది.  

చదవండి: (దేశంలో మూడో స్వచ్ఛ నౌకాశ్రయంగా విశాఖ పోర్టు)

అప్పుడు వైఎస్‌..ఇప్పుడు జగన్‌ 
బీచ్‌ ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డే కారణం. 2004 సునామీ తరువాత బాధితుల కోసం తీరంలో ఇళ్లు నిర్మించారు. 2007లో వాటిని ప్రారంభించడానికి వచ్చిన వైఎస్‌ పేరుపాలెం బీచ్‌లో జరిగిన సభలో పాల్గొన్నారు. అప్పుడు బీచ్‌ అభివృద్ధి ఆవశ్యకత గురించి ఎమ్మెల్యే ముదునూరి ద్వారా తెలుసుకున్నారు. అప్పటికప్పుడు బీచ్‌ అభివృద్ధికి రూ 2.80 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో రివిట్‌మెంట్‌తో కలిపి రోడ్డు వేశారు. గెస్ట్‌హౌస్‌ నిర్మించారు. అప్పటి నుంచి బీచ్‌కు జనం రాకపోకలు పెరిగాయి. రిసార్టుల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 10 ఏళ్లలో పాలకులు బీచ్‌ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీచ్‌ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.   

భవిష్యత్‌లో రూపురేఖలు మారిపోతాయి 
గతేడాది బీచ్‌ ఫెస్టివల్‌ పేరుపాలెంలో జరగడం ముందడుగుగా భావించాలి. ముఖ్యమంత్రి బీచ్‌ అభివృద్ధికి సహకరిస్తున్నారు. భవిష్యత్‌లో బీచ్‌ రూపురేఖలు పూర్తిగా మారుస్తాం. కరోనా వల్ల అభివృద్ధి పనులకు కొంత ఆటకం కలిగింది. త్వరలో హోటల్స్, రిసార్ట్స్‌ నిర్మాణాలు చేపడతాం. 
-ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top