
నిర్దేశిత ధర కంటే 5% అధిక ధరకు టెండర్లు వేస్తారని ముందే ఊహించేసిన సర్కార్
కొప్పర్తి, ఓర్వకల్లు నోడ్స్ ఈపీసీ టెండర్లలో 5% ప్రీమియం క్యాప్ ఎత్తివేత
టెండర్లకు ముందే పరిమితి ఎత్తివేతపై అధికారుల విస్మయం
సాక్షి, అమరావతి: యమలీల సినిమాలో హీరో ఆలీకి భవిష్యవాణి పుస్తకం దొరికి అందులో జరగబోయేవన్నీ ముందే తెలిసిపోతుంటాయి. అలాగే ఈ ప్రభుత్వానికి కూడా టెండర్లు ఎంత ధరకు కోట్ చేస్తారో ముందే తెలిసిపోతున్నట్లుంది. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక నోడ్ల అభివృద్ధి కోసం పిలిచే టెండర్లు నిర్దేశిత ధర కంటే 5% కంటే ఎక్కువ ప్రీమియంకు టెండర్లు దాఖలవుతాయని ప్రభుత్వానికి ముందే తెలిసిపోయినట్లుంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టెండర్లలో నిర్దేశిత ధర కంటే 5% ప్రీమియం పరిమితిని ఎత్తివేస్తూ జీవోలనే జారీ చేసింది.
విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్లో భాగంగా కొప్పర్తి పారిశ్రామిక నోడ్, హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా ఓర్వకల్లు నోడ్లను కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ నిధులతో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో కొప్పర్తిలో మొదటి దశలో 2,595.74 ఎకరాలను ఈపీసీ విధానంలో అభివృద్ధి చేయడానికి రూ.1,264.44 కోట్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది.
ఓర్వకల్లు నోడ్ను 2,624.64 ఎకరాల్లో రూ.1,771.19 కోట్లతో అభివృద్ధి చేయడానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇప్పుడు ఆ ఉత్తర్వుల్లో టెండర్ ప్రీమియంను 5%కు ఎత్తివేస్తున్నట్లు పేర్కొనడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకవేళ టెండర్లు నిర్దేశిత ధర కంటే అధిక ధరకు కోట్ చేసిన సమయంలో ప్రత్యేక జీవో ఇచ్చి వాటికి అనుమతిస్తారని, కానీ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా టెండర్లు పిలవకుండానే టెండర్ ప్రీమియం 5% ఎత్తివేస్తూ ఏకంగా జీవో ఇచ్చారని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
అంటే నిర్దేశిత ధరకంటే ఎక్కువ ధరకు బిడ్లు దాఖలవుతాయన్న విషయం ప్రభుత్వానికి తెలుసన్న విషయాన్ని ఈ జీవో స్పష్టం చేస్తోందన్నారు. ముందుగానే తమకు నచ్చిన వారికి ప్రీమియం ధరకు టెండర్లు కట్టబెట్టడానికి ఈ జీవో జారీ చేసినట్లుగా అర్థమవుతోంది.