
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల అక్టోబర్ కోటాను ఈనెల 19 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎల్రక్టానిక్ డిప్ కోసం జూలై 21 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూలై 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, వార్షిక పుష్పయాగం టికెట్లను జూలై 22న, అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటాను టీటీడీ విడుదల చేస్తుంది.
ఇక జూలై 23న అంగప్రదక్షిణం టోకెన్ల కోటా, అనంతరం శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి శ్రీవారి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తుంది. అక్టోబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను విడుదల చేస్తుంది. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.