502 టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌  | Notification for filling 502 teacher posts in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

502 టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ 

Aug 24 2022 2:21 AM | Updated on Aug 24 2022 9:40 AM

Notification for filling 502 teacher posts in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ యాజమాన్య పాఠశాలల్లో 502 టీచర్‌ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ సోమవారం రాత్రి నోటిఫికేషన్లు జారీ చేసింది. టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌) ద్వారా వీటిని భర్తీ చేయనుంది. గతంలో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేయడానికి ఇప్పుడు నోటిఫికేషన్‌ ఇచ్చింది. జిల్లా పరిషత్‌ (జెడ్పీ), మండల ప్రజా పరిషత్‌ (ఎంపీపీ) స్కూళ్లలో 199 పోస్టులు, మోడల్‌ స్కూళ్లలో 207, మున్సిపల్‌ స్కూళ్లలో 15, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు 81 పోస్టులను భర్తీ  చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ వేర్వేరుగా నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఈ పోస్టులకు  https://cse.ap.gov.in  ద్వారా  ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.  

కంప్యూటరాధారితంగా పరీక్షలు 
ఈ టీచర్‌ పోస్టుల భర్తీకి అక్టోబర్‌ 23 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. సబ్జెక్టుల వారీగా ఈ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం కంప్యూటరాధారితంగా జరుగుతాయి. ఇందులో మెరిట్, రిజర్వేషన్లు, ఇతర నిబంధనల ప్రకారం ఆయా పోస్టులను భర్తీ చేస్తారు. ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ స్కూళ్లలో సెకండరీ గ్రేడ్‌ టీచర్, స్కూల్‌ అసిస్టెంట్‌ (లాంగ్వేజెస్‌), స్కూల్‌ అసిస్టెంట్‌ (నాన్‌ లాంగ్వేజెస్‌), టీజీటీ (లాంగ్వేజెస్‌), టీజీటీ (నాన్‌ లాంగ్వేజెస్‌), టీజీటీ (ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ), పీజీటీ (లాంగ్వేజెస్‌), పీజీటీ (నాన్‌ లాంగ్వేజెస్‌), పీజీటీ (ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌), మ్యూజిక్, ఆర్ట్స్‌ విభాగాల వారీగా ఈ పరీక్షలుంటాయి.  

 

డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ 
టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులకు టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌)లో వచ్చిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లు, ఇతర నిబంధనలను అనుసరించి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. జనరల్‌ మహిళ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు.   

Advertisement
 
Advertisement
Advertisement