సాక్షి, నెల్లూరు జిల్లా: జువ్వలదిన్నె బోట్ల వివాదం కొత్త మలుపు తిరిగింది. వివాదంలో ఎంపీ బీద మస్తాన్రావు తీరుపై నెల్లూరు సముద్ర తీర మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ బీదా మస్తాన్ రావు పేరు ప్రస్తావనకు రాకుండా ఉండటం కోసం పోలీసులు యాక్షన్ ప్లాన్ చేశారు. నారా లోకేష్ ఆదేశాలతో మత్స్యకార గ్రామాల్లో నెల్లూరు రూరల్ డీఎస్పీ టీం ఆపరేషన్ చేపట్టింది.
సర్వేపల్లి నియోజకవర్గం, వెంకన్నపాలెం గ్రామ మత్స్యకారులతో పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. వ్యవహారంతో బీదాకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు.. మత్స్యకారులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల యత్నాలను మత్స్యకారులు తీవ్రంగా ప్రతిఘటించారు.
‘‘ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ముందుగా మాకు నిజం చెప్పి వుండాలి. నిజాన్ని ఎందుకు దాచాడు? మేమే సమస్యను పరిష్కరించుకునే వాళ్లం. ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేయడం సరైంది కాదు. ఎవరు తప్పు చేశారో మాకు తెలుసు. మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు ఆపండి. రాజకీయాలతో మాకు సంబంధం లేదు. మా ప్రతిష్ట మాకు ముఖ్యం. మీ ప్రభుత్వ, పోలీస్ బెదిరింపులకు తలొగ్గేది లేదు’’ అంటూ పోలీసులతో మత్స్యకారులు తేల్చి చెప్పారు.


