
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మరో మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్రలోని విస్తరిస్తున్నాయి. ఫలితంగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో వచ్చే మూడు రోజులు అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశాలున్నాయి. ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు కూడా సంభవిస్తాయని ఐఎండీ తెలిపింది.
ఆదివారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కాగా.. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో అత్యధికంగా 3.6 సెం.మీ., దుత్తలూరు (నెల్లూరు) 3.2, యాడికి (అనంతపురం) 2.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది.