
సాక్షి, నెల్లూరు: ప్రజలకు మంచి చేసిన వ్యక్తి కాకాణి గోవర్థన్ రెడ్డి.. అలాంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు కాకాణి కుమార్తె పూజితా రెడ్డి. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఇంకా విచారణలో ఉంది. విచారణలో ఉండగానే అరెస్ట్ చేసి బెదిరించాలని చూస్తున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితా రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మా నాన్నని అక్రమంగా అరెస్ట్ చేశారు. ప్రజలకి మంచి చేసిన ప్రతీసారి మా నాన్న మొహంలో ఆనందం కనిపిస్తుంది. కరోనా సమయంలో ప్రాణాలని కూడా లెక్కచేయకుండా ప్రజలకి సదుపాయాలు కల్పించారు. మంత్రిగా పనిచేసిన రెండేళ్లలో మా నాన్నని నేను ఒక పదిసార్లు మాత్రమే చూశాను.. ఎప్పుడు జనాల్లోనే ఉండేవారు. ప్రతిపక్షాన్ని రాజకీయ ప్రత్యర్ధులుగా మాత్రమే చూడాలని.. శత్రువులుగా చూడొద్దని మా నాన్న చెప్పేవారు. అలాంటి వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం చాలా బాధాకరం.
గతంలో పెట్టిన కేసుల్లో విచారణకు నాన్న వచ్చారు. ఈ అక్రమ కేసులో అరెస్ట్ చేస్తారని తెలిసి దూరంగా ఉన్నారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఇంకా విచారణలో ఉంది. విచారణలో ఉండగానే అరెస్ట్ చేసి బెదిరించాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలని బెదిరించాలని, భయపెట్టాలని చూస్తున్నారు. మా నాన్నకు అండగా నిలుస్తున్న కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు చెబుతున్నాం. మా నాన్న కడిగిన ముత్యంలా బయటకి వస్తారు’ అని వ్యాఖ్యానించారు.
