అధిక డేటా.. మరింత వేగం | Sakshi
Sakshi News home page

అధిక డేటా.. మరింత వేగం

Published Fri, Sep 10 2021 4:23 AM

Internet speed increased to 20 Mbps Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: మరింత వేగంగా అధిక డేటాను అందించే విధంగా ఏపీ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌) బేసిక్‌ ప్లాన్‌లో మార్పులను చేసింది. ఇప్పటివరకు ప్రతి నెలా 100 జీబీగా ఉన్న డేటా వినియోగ సామర్థ్యాన్ని 150 జీబీకి పెంచడంతో పాటు ఇంటర్నెట్‌ వేగాన్ని 15 ఎంబీపీఎస్‌ నుంచి 20 ఎంబీపీఎస్‌కు పెంచినట్లు ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ పి.గౌతమ్‌రెడ్డి ప్రకటించారు. విజయవాడలో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ప్రధాన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వీటితో పాటు సోనీ గ్రూపునకు చెందిన స్పోర్ట్స్‌ చానల్స్, సీఎన్‌బీసీ, జీ గ్రూపునకు చెందిన మొత్తం 10 చానల్స్‌ను అదనంగా అందిస్తున్నట్లు తెలిపారు.

కేబుల్‌ టీవీతో పాటు ఉచితంగా టెలీఫోన్, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తున్న బేసిక్‌ ప్లాన్‌ చార్జీని రూ.300 నుంచి రూ.350కి సవరించినట్లు తెలిపారు. రూ.449, రూ.599 ప్లాన్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ 9.2 లక్షల కనెక్షన్లను కలిగి ఉందని, వీటికి అదనంగా మరో 10 లక్షల కనెక్షన్లు అందించే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడం కోసం విశాఖ, విజయవాడ, తిరుపతిలలో సెట్‌టాప్‌ బాక్స్‌ల మరమ్మతుల కోసం సర్వీసు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం అక్రమాల కారణంగా నష్టాల్లోకి జారుకున్న సంస్థను తిరిగి లాభాల్లోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం టెరా సాఫ్ట్‌ పేరుతో జరిపిన కుంభకోణంపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, ప్రస్తుతం ఈ కేసును సీఐడీ వేగంగా విచారణ జరుపుతోందని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement