మొదటి విడతలో 1,570 సెంటర్లలో నిర్వహణ
సొంత కాలేజీల్లోనే సెంటర్లు
కార్పొరేట్ కాలేజీలకు మేలు జరిగేలా జంబ్లింగ్ విధానం ఎత్తివేత
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నేటి నుంచి ఈనెల 10 వరకు ఉదయం 9 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్స్లో నిర్వహించనున్నారు. గత విద్యా సంవత్సరం నుంచి ఏ కాలేజీకి ఆ కాలేజీలోనే సెంటర్లు (సెల్ఫ్ సెంటర్స్) ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,274 సెంటర్లు, ఒకేషనల్ సబ్జెక్టులకు 624 సెంటర్లను ఏర్పాటు చేశారు. కాగా, మొదటి విడత (స్పెల్–1)లో 1,570 సెంటర్లలో ప్రాక్టికల్స్ జరగనున్నాయి.
జంబ్లింగ్ విధానం ఎత్తివేత
పబ్లిక్ పరీక్షలతో పాటు ప్రాక్టికల్ పరీక్షల్లోనూ మాల్ ప్రాక్టీస్ను నిర్మూలించేందుకు గతంలో జంబ్లింగ్ విధానం అమలు చేశారు. ఒక కాలేజీ విద్యార్థులు అదే కాలేజీలో ప్రాక్టికల్స్ పరీక్షలు రాసేందుకు అవకాశం ఉండేది కాదు. దీంతో అన్ని కాలేజీల విద్యార్థులకు సమన్యాయం జరిగేది. కానీ, గత ఏడాది నుంచి జంబ్లింగ్ విధానం ఎత్తేసి, ఏ కాలేజీ విద్యార్థులకు ఆ కాలేజీలోనే ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు.
దీంతో విద్యార్థుల ప్రతిభతో సంబంధం లేకుండా మార్కుల నమోదు ప్రహసనంగా మారింది. ముఖ్యంగా కార్పొరేట్ కాలేజీలు దీనిని వరంగా మార్చుకున్నాయి. అలాగే, గతంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ లెక్చరర్లను మాత్రమే ప్రాక్టికల్ విధులకు నియమించేవారు. మ్యాథమెటిక్స్ లెక్చరర్లు మాత్రం పూర్తిగా కాలేజీ విధుల్లో ఉండేలా ఇంటర్ బోర్డు స్పష్టమైన ఆదేశాలిచి్చంది. ఇప్పుడు ఈ విధానం కూడా పూర్తిగా మార్చేశారు.


