శ్రీశైలానికి పెరిగిన ప్రవాహం | Increased flow to Srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలానికి పెరిగిన ప్రవాహం

Sep 7 2024 3:29 AM | Updated on Sep 7 2024 3:29 AM

Increased flow to Srisailam

శ్రీశైలం ప్రాజెక్ట్‌/విజయపురి సౌత్‌: శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాల ప్రవాహం పెరిగింది. శ్రీశైలానికి జూరాల, సుంకేసుల, హంద్రీల నుంచి 1,47,682 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. దీంతో శుక్రవారం 6 గేట్లను తెరచి నాగార్జునసాగర్‌కు 1,67,076 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 

ప్రస్తుతం జలాశయంలో 212.91 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. నీటిమట్టం 884.40 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం జలాశయం స్పిల్‌వే, కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా నీటిని విడుదల చేస్తుండటంతో శుక్రవారం నాగార్జున సాగర్‌ జలాశయానికి 2,04064 క్యూసెక్కులు జలాలు వస్తున్నాయి. 

ఇక్కడి నుంచి 20 క్రస్ట్‌ గేట్లు ఎత్తి స్పిల్‌వే మీదుగా 1,61,800 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో మరో 28,339 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ, ఏఎమ్మారీ్ప, వరద కాల్వల ద్వారా 13,925 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజికి 1,31,803 క్యూసెక్కులు వస్తుండగా 202 క్యూసెక్కులు కాలువలకు వదులుతున్నారు. మిగులుగా ఉన్న 1,31,601 క్యూసెక్కులు సముద్రంలోకి వదులుతున్నారు. 

శాంతిస్తున్న గోదావరి 
ధవళేశ్వరం: ఉరకలెత్తిన గోదావరి క్రమేపీ శాంతిస్తోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద నీటి మట్టం 12.10 అడుగులకు చేరింది. గురువారం రాత్రి 11.75 అడుగులకు నీటి మట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 

అనంతరం క్రమేపీ పెరుగుతూ శుక్రవారం ఉదయానికి 12.30 అడుగులకు చేరింది. సాయంత్రం 6 గంటలకు స్వల్పంగా తగ్గింది. కాటన్‌ బ్యారేజీ నుంచి 10,36,440 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. డెల్టా కాలువలకు 2,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 


∙ఆరు గేట్ల ద్వారా 1,67,076 క్యూసెక్కులు విడుదల 
∙ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 1,31,601 క్యూసెక్కులు సముద్రంలోకి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement