బడ్జెట్లో బీసీలకు ప్రత్యేక ప్యాకేజీ: ఆర్. కృష్ణయ్య హర్షం
సాక్షి, అమరావతి: దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా ఏపీ బడ్జెట్లో వెనుకబడిన తరగతుల(బీసీల) అభివృద్ధికి ఏకంగా రూ.28 వేల కోట్లు కేటాయించడం చరిత్రాత్మకమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు.
బడ్జెట్పై శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. దేశంలో బీసీ ముఖ్యమంత్రులున్న రాష్ట్రాల్లోనూ బీసీలకు రూ.5 వేల కోట్లకు మించి కేటాయింపులు చేయలేదని గుర్తు చేశారు. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో బీసీల సంక్షేమానికి కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమే కేటాయిచారన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి నామమాత్రంగానే నిధులు కేటాయించిందన్నారు. అందుకు విరుద్ధంగా ఏపీలో జనాభా ప్రాతిపదికన బీసీలకు ఏకంగా రూ.28 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యసాహసాలకు సలామ్ చేస్తున్నానన్నారు.
ఇప్పటికే బీసీ కులాల అభివృద్ధికి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం వాటా ఇవ్వడం సీఎం వైఎస్ జగన్ గొప్ప దార్శనికతకు అద్దం పడుతోందన్నారు. అమ్మ ఒడి, విద్యా దీవెన వంటి విప్లవాత్మక పథకాలతో బీసీ, అట్టడుగు వర్గాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని కితాబిచ్చారు.