చట్టం అంటే లెక్క లేదా?: హైకోర్టు | High Court once again expresses strong anger against AP police | Sakshi
Sakshi News home page

చట్టం అంటే లెక్క లేదా?: హైకోర్టు

Apr 22 2025 4:49 AM | Updated on Apr 22 2025 3:43 PM

High Court once again expresses strong anger against AP police

పోలీసులపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం

అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది?..  

సిట్‌ అధికారులు చాలా పెద్దవాళ్లం.. 

శక్తిమంతులం అని భావిస్తున్నారు..  

మీకు చట్టం అంటే గౌరవం లేదని అర్థమవుతోంది 

పోలీసులే చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు?.. మీరున్నది చట్టాన్ని కాపాడటానికి తమకు చట్టం అవసరం లేదు.. 

అధికారమే ముఖ్యమనుకుంటున్నారు 

ఒంటిపై యూనిఫామ్‌ ఉందని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకుంటున్నారు 

మిమ్మల్ని వెనక నుంచి నడిపిస్తున్న వారిని రమ్మనండి.. చట్టం గురించి వారితోనే మాట్లాడతాం 

పోలీసుల వైఖరి అత్యంత బాధాకరం.. ఇలాగే వదిలేస్తే రేపు అందరం బాధపడాలి 

వ్యక్తి స్వేచ్ఛ కన్నా కోర్టులకు ఏదీ ముఖ్యం కాదు  

అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? చట్టాన్ని బేఖాతర్‌ చేస్తున్న పోలీసులను ఇలాగే వదిలేస్తే రేపు మనం అందరం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వ్యక్తి స్వేచ్ఛకు మించి మాకు ఏదీ ముఖ్యం కాదు. ఈ విషయాన్ని పలుమార్లు పునరుద్ఘాటించినా పోలీసులు కోర్టుల ఆదేశాలను లెక్కచేయడం లేదు. పోలీసులై ఉండి చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు? మీరుండేది చట్టాన్ని, న్యాయాన్ని కాపాడటానికా? లేక దాన్ని ఉల్లంఘించడానికా? పిల్లలు తప్పు చేశారంటూ తల్లిదండ్రులను వేధిస్తారా? తెలియని విషయాలను చెప్పాలని ఒత్తిడి చేస్తారా? ఇలా చేయమని ఏ చట్టం మీకు చెబుతోంది? పౌరుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా?     
 – హైకోర్టు

సాక్షి, అమరావతి: రెడ్‌బుక్‌ అరాచకాలకు కొమ్ము కాస్తూ రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు తూట్లు పొడుస్తున్న పోలీసు ఉన్నతాధికారులు, సిట్‌ అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? చట్టాన్ని బేఖాతర్‌ చేస్తున్న పోలీసులను ఇలాగే వదిలేస్తే రేపు మనం అందరం ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి స్వేచ్ఛకు మించి తమకు ఏదీ ముఖ్యం కాదని, ఈ విషయాన్ని పలుమార్లు పునరుద్ఘాటించినా పోలీసులు కోర్టుల ఆదేశాలను లెక్కచేయడం లేదని మండిపడింది. 

‘‘పోలీసులై ఉండి చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు? మీరుండేది చట్టాన్ని, న్యాయాన్ని కాపాడటానికా? లేక దాన్ని ఉల్లంఘించడానికా? పిల్లలు తప్పు చేశారంటూ తల్లిదండ్రులను వేధిస్తారా? తెలియని విషయాలను చెప్పాలని ఒత్తిడి చేస్తారా? ఇలా చేయమని ఏ చట్టం మీకు చెబుతోంది? పౌరుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? దర్యాప్తు అధికారినే మా ముందుకు రమ్మనండి.. చట్టం ఏం చెబుతుందో ఆయన్ను అడిగి తెలుసుకుంటాం. సిట్‌లోని అధికారులు వారికి వారు చాలా పెద్దవాళ్లం.. శక్తిమంతులం అని అనుకుంటున్నారు. శక్తిమంతులం కాబట్టి ఏం చేసినా చెల్లుతుందని భావిస్తున్నారు. 

చట్టం అవసరం లేదు.. అధికారమే ముఖ్యమని అనుకుంటున్నారు. ఒంటిపై యూనిఫాం ఉంది కదా ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఆలోచనలో ఉన్నారు. సిట్‌ అదనపు ఎస్పీ ఎవరు  కావాలంటే వారిని తీసుకొచ్చేస్తారా? పోలీసుల వ్యవహారశైలి అత్యంత దురదృష్టకరం’’ అని సోమవారం ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సాక్షిగా ఓ వృద్ధుడిని విచారించాలంటే చట్టం ఏం చెబుతుందో మీకు తెలియదా? అని సూటిగా ప్రశ్నించింది. 

ఆయన్ను సిట్‌ అదనపు ఎస్పీ తిరుపతి నుంచి విజయవాడకు ఎందుకు పిలిపించాల్సి వచ్చిందో స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో దర్యాప్తు అధికారి శ్రీహరిబాబుని సుమోటోగా ప్రతివాదిగా చేరుస్తూ తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, డాక్టర్‌ జస్టిస్‌ కుంభజడల మన్మథరావుల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.   

సిట్‌ దర్యాప్తు అధికారిపై నిప్పులు.. 
రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతున్న తీరు, పోలీసుల దుర్మార్గ పోకడను తిరుపతికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు, విశ్రాంత పోలీసు అధికారి సుబ్రహ్మణ్యంరెడ్డి హైకోర్టుకు పూసగుచి్చనట్లు నివేదించారు. కేసు ఏమిటి? నేరం ఏమిటి? అనే విషయాలను చెప్పకుండా తనను అర్ధరాత్రి తిరుపతి నుంచి విజయవాడకు ఆగమేఘాలపై తరలించిన పోలీసులు విచారణ పేరుతో దారుణంగా వ్యవహరించారని హైకోర్టుకు మొర పెట్టుకున్నారు. 

క్యాన్సర్‌తో బాధపడుతున్న తన భార్యకు కనీసం మందులు కొనేంత వరకైనా ఆగాలని ప్రాథేయపడినా వినకుండా బలవంతంగా తరలించారంటూ కన్నీటిపర్యంతమయ్యారు. పదోన్నతి కూడా వద్దనుకుని భార్యకు సపర్యలు చేస్తూ ఇంటి వద్ద ఉంటున్న తన పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారన్నారు. తానేదో నేరం చేసినట్లు ఇంటి వద్ద మోహరించారన్నారు. 

ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు ముఖ్యంగా దర్యాప్తు అధికారి (ఐవో) విచారణ పేరుతో తనను బంధించి చిత్రహింసలు పెట్టారని కోర్టు దృష్టికి తెచ్చారు. సినిమాల్లో మాదిరిగా ప్రవర్తించి తనను తీవ్ర భయభాంత్రులకు గురి చేశారన్నారు. ఎవరు.. ఎప్పుడు.. ఎక్కడి నుంచి వచ్చి తన వెంటపడతారోనని భయంగా ఉందన్నారు. 

సుబ్రహ్మణ్యంరెడ్డి చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సిట్‌ దర్యాప్తు అధికారి, అదనపు ఎస్‌పీతో పాటు ఇతర పోలీసులపై నిప్పులు చెరిగింది. ‘అసలు ఏం కేసు ఉందని సుబ్రహ్మణ్యంరెడ్డిని తిరుపతి నుంచి విజయవాడకు పిలిపించారు. ఆయన ఏ కేసులోనూ నిందితుడు కారు. అలాంటప్పుడు ఆయన పట్ల దురుసుగా ఎందుకు ప్రవర్తించినట్లు? అధికారం ఉంది కాబట్టి చేశామంటారా? అదే విషయం చెప్పండి.. ఏం చేయాలో మాకు బాగా తెలుసు...’ అని న్యాయస్థానం మండిపడింది. 

ఏపీ పోలీసుల తీరుపై హైకోర్ట్ మరోసారి తీవ్ర ఆగ్రహం



బాలసుబ్రహ్మణ్యంరెడ్డిని గుర్తు తెలియని పోలీసులు ఈ నెల 16వ తేదీ రాత్రి 11.50 గంటలకు తిరుపతిలోని ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లడంపై వైఎస్సార్‌సీపీ నేత మేకా వెంకటరామిరెడ్డి గత వారం హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం ఆదేశాల మేరకు బాలసుబ్రహ్మణ్యంరెడ్డి స్వయంగా కోర్టు ముందు హాజరై వాస్తవాలను నివేదించారు. 

‘పోలీసు వాహనంలో నన్ను విజయవాడ కమిషనర్‌ వద్దకు తరలించి నా మొబైల్‌ లాక్కున్నారు. సిట్‌ అదనపు ఎస్‌పీ నన్ను దూషించారు. బంధించి హింసలు పెట్టారు. ముందు రోజే నోటీసులు ఇచి్చనట్లు ఆ తేదీ వేసి నన్ను సంతకం చేయమన్నారు. కాపీ మాత్రం ఇవ్వలేదు. తెల్ల కాగితాలపై నా సంతకాలు తీసుకున్నారు..’ అని కోర్టుకు విన్నవించారు.

ఆటిట్యూడ్‌ చూపితే ఏం చేయాలో తెలుసు...
బాలసుబ్రహ్మణ్యంరెడ్డి చెప్పిన వివరాలన్నింటినీ అఫిడవిట్‌ రూపంలో కోర్టు ముందుంచితేనే వాటికి సమాధానం ఇవ్వడం సాధ్యమవుతుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) పేర్కొనటంపై ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వ న్యాయవాది నుంచి తాము ఇలాంటి తీరును ఆశించడం లేదని స్పష్టం చేసింది. అఫిడవిట్‌ దాఖలు చేస్తేనే స్పందిస్తామంటే ఆ దిశగా ఆదేశాలు ఇస్తామని, ఆ అఫిడవిట్‌కు వెంటనే కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదికి తేల్చి చెప్పింది. 

ఇలాంటి ఆటిట్యూడ్‌ చూపిస్తే  ఏం చేయాలో తమకు తెలుసునంది. బాలసుబ్రహ్మణ్యంరెడ్డి ఇంటి వద్ద ఉన్న పోలీసులెవరని ప్రశ్నించగా ఎస్‌జీపీ వారి పేర్లను తెలిపారు. అసలు ఇదంతా చేయమని వెనకుండి ఎవరు చెబుతున్నారో వారిని ముందుకు రమ్మనండని, చట్టం గురించి వారితోనే మాట్లాడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. అవసరమైతే ఈ కేసులో తామే ట్రయల్‌ కూడా నిర్వహిస్తామని, సుబ్రహ్మణ్యంరెడ్డి చెప్పిన వివరాలను వాంగ్మూలంగా తామే నమోదు చేస్తామంది. 

ఈ సమయంలో పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సుబ్రహ్మణ్యం శ్రీరామ్‌ స్పందిస్తూ, బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 179ని చదివి వినిపించారు. ఈ సెక్షన్‌ ప్రకారం 60 ఏళ్ల పైబడిన వారిని వారి ఇంటి వద్దనే విచారించాల్సి ఉంటుందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పోలీసులు దురుద్దేశంతో, బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని వివరించారు. చట్టం అంటే గౌరవమే లేదని, చట్ట నిబంధనలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని పోలీసులను ఉద్దేశించి ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. దర్యాప్తు పేరుతో ఎలా పడితే అలా వ్యవహరిస్తామంటే కుదరదని స్పష్టం చేసింది.    

18-12-2024..
మెదడు ఉపయోగించకుండా యాంత్రికంగా రిమాండ్‌ ఉత్తర్వులు..
‘సోషల్‌ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 111 కింద దర్యాప్తు అధికారి కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో ఎలాంటి ఆధారాలు చూపలేదు. అయినా కింది కోర్టు మెజిస్ట్రేట్‌ ఆధారాలున్నా­యనడం తప్పు. మెజిస్ట్రేట్‌ మెదడు ఉపయోగించకుండా, యాంత్రికంగా రిమాండ్‌ ఉత్తర్వులిచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో అరెస్ట్‌కు గల కారణాలను చెప్పలేదు..’ 
– సోషల్‌ మీడియా పోస్టులకు సంబంధించి తన కుమారుడు వెంకట రమణారెడ్డికి వినుకొండ కోర్టు విధించిన రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ పప్పుల చెలమారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు.

06-01-2025
కోర్టుల కన్నా ఎక్కువ అనుకుంటున్నారా..?
‘సోషల్‌ మీడియా యాక్టివిస్టు వర్రా రవీంద్రరెడ్డి నిర్బంధానికి సంబంధించి మేం అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధా­నాలు ఇవ్వాలి. రవీంద్రరెడ్డిని ఎప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నారు? ఎప్పుడు అరెస్ట్‌ చూపారు? ఆయనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారా..? ఈ ప్రశ్నలకు సూటిగా సమాధా­నాలు కావాలి. ఈ కేసులో పోలీసులు మొదటి నుంచి మా ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి తీరును సహించేది లేదు. కోర్టులకన్నా ఎక్కువ అనుకుంటున్నారా? కడప ఎస్పీ తీరు చూస్తుంటే అలాగే ఉంది. ఆరోపణలు నిజమని తేలితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి..!’ 
– వర్రా రవీంద్రరెడ్డి అక్రమ నిర్బంధంపై ఆయన భార్య కళ్యాణి దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు

18-02-2025..
లోపలేయడం మినహా మీరేం చేస్తున్నారు?
‘వ్యక్తులపై కేసులు పెట్టడం.. వారిని కొట్టడం.. లోపలేయ­డం మినహా మీరేం చేస్తున్నారు? కేసులు పెట్టి లోపల వేయడం మినహా ఏ కేసులోనూ దర్యాప్తు చేయ­డం లేదు. కోర్టు ఆదేశా­లను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇలాంటి తీరును సహించేది లేదు. బొసా రమణ అనే వ్యక్తి అరెస్ట్‌ విషయంలో దర్యాప్తు చేసి ఉంటే ఆ వివరాలను మా ముందు ఉంచేవారు. దర్యాప్తు చేయలేదు కాబట్టే ఏ వివరాలను సమర్పించలేదు. అతడిపై 27 కేసులున్నా­యని చెబుతున్నారు. కానీ ఆ కేసుల దర్యాప్తు వివరాలను మా ముందు ఉంచడంలేదు. మా ఆదేశాలపై డీజీపీ ఏ చర్యలు తీసుకున్నారు..?’ 
– విశాఖకు చెందిన బొసా రమణ అరెస్టుపై ఆయన భార్య దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ సమయంలో హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు

25-02-2025
పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు..
‘పోలీసులు వాస్తవాలను దాచి పెడుతూ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. బొసా రమణ అరెస్టు విషయంలో డీజీపీ నివేదిక ఇస్తారని ఆశించాం. కానీ ఎలాంటి నివేదిక రాలేదు. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని డీజీపీని నివేదిక కోరాం. డీజీపీ పోస్టుపై ఉన్న గౌరవంతో వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వలేదు. రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక ఇస్తామని డీజీపీ భావిస్తే అలాగే ఆదేశాలు ఇస్తాం. రమణ అరెస్టు విషయంలో విశాఖ పోలీస్‌ కమిషనర్, ప్రకాశం జిల్లా కలెక్టర్‌ నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి...’ 
– బొసా రమణ భార్య దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు.

11-03-2025
‘పౌరుల స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం..
‘పౌరుల స్వేచ్ఛను హరిస్తామంటే ఊరుకోం. ఎలా పడితే అలా అరెస్ట్‌ చేస్తామంటే కుదరదు. రుజువు లేకుండా ఊహల ఆధారంగా అరెస్ట్‌ చేస్తారా? తాము చట్టం కంటే ఎక్కువని పోలీసులు భావిస్తున్నారు. చిన్న తప్పులేనని వదిలేస్తే.. రేపు కోర్టులకు వచ్చి మరీ అరెస్టు చేస్తారు. ప్రతి దశలోనూ పోలీసులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారు..’
– సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ అవుతు శ్రీధర్‌రెడ్డికి కింది కోర్టు విధించిన రిమాండ్‌ చట్ట విరుద్ధమని కొట్టివేసిన సందర్భంలో హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు

25-03-2025
హద్దు మీరొద్దు 
‘తప్పు చేస్తే.. కేసు పెట్టడం, అరెస్ట్‌ చేయడం తప్పు కాదు. కానీ అరెస్ట్‌ చేయడానికే కేసు పెడితేనే సమస్య. మీ తప్పులను ఎన్నని ఎత్తి చూపాలి? ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోండి. పోలీసులు పరిధి దాటి వ్యవహరించడంపై మాకు చాలా విషయాలు తెలుసు. మేం కోర్టుల్లో ఉంటాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలియదని ఎంత మాత్రం అనుకోవద్దు. పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరుగుతోంది.   
– మాదిగ మహాసేన అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌ అరెస్ట్‌పై హైకోర్టు వ్యాఖ్యలు

10-04-2025
ఇది ధిక్కారమే... 
హైకోర్టు ఆదేశాలంటే పోలీసులకు లెక్కే లేకుండా పోయింది. సెక్షన్‌ 111ను ఎప్పుడు, ఎలాంటి సందర్భాల్లో వాడాలో స్పష్టంగా చెప్పాం. అయినా ఆ సెక్షన్‌ కింద కేసులు నమోదు చేయడమంటే మా ఆదేశాలను ధిక్కరిస్తున్నట్లే. ఎప్పుడో నమోదు చేసిన కేసులో మీ ఇష్టం వచ్చినట్లు ఇప్పుడు అదనపు సెక్షన్లు ఎలా చేరుస్తారు? అంటే ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నట్లు కాదా?’ 
– పోసాని కృష్ణ మురళిపై కేసు విచారణలో హైకోర్టు న్యాయమూర్తి    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement