కాలానుగుణంగా వృత్తి నైపుణ్యం పెంచుకుంటాం
పోలీస్ డ్యూటీ మీట్లో డీజీపీ
సాక్షి, అమరావతి: మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు శాఖలో వృత్తిపరమైన నైపుణ్యం పెంచుకుంటామని పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) గౌతమ్ సవాంగ్ అన్నారు. తిరుపతిలో జరుగుతున్న ఏపీ పోలీస్ డ్యూటీ మీట్ తొలిరోజు ప్రారంభ కార్యక్రమంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ తొలి డ్యూటీ మీట్ పోలీస్ శాఖ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, 15 ఏళ్ల తర్వాత తిరుపతిలో రెండవ సారి నిర్వహించుకుంటున్నామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆరేళ్లుగా డ్యూటీ మీట్ నిర్వహించలేదన్నారు. ఇక నుంచి ఏటా దీన్ని నిర్వహించుకుంటామని చెప్పారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీల తొలి సమావేశంలో పీపుల్స్ ఫ్రెండ్లీగా వ్యవహరించాలంటూ చిరునవ్వుతో చెప్పారని డీజీపీ గుర్తు చేసుకున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలుస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు గర్వంగా పీలవుతున్నామన్నారు. జాతీయ స్థాయిలో 108 అవార్డులను అందుకోవడం ఏపీ పోలీస్ పనితీరుకు కొనమానం అన్నారు. రాష్ట్రంలో పారదర్శకంగా, అంకితభావంతో పోలీసులు పనిచేస్తున్నారన్నారు.