సాక్షి, తాడేపల్లి: ఉండవల్లిలో సీడ్ యాక్సెస్ రోడ్డుపై రైతుల ఆందోళన చేపట్టారు. ఉండవల్లి రైతులను ఫేక్ అంటూ ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని.. ఇప్పటివరకు అవకాశం దొరకలేదన్నారు. విజయవాడ కిలోమీటరు దూరం. ఇక్కడ 2015లోనే విల్లాలు, 2014కి ముందే అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇంత అభివృద్ధి చెందిన ఊర్లో మమ్మల్ని రైతులే కాదంటే ఎలా అంటూ ప్రశ్నించారు.
ఉండవల్లిని ఎల్పీఎస్, ఎల్ఏ నుంచి విరమింప చేయాలని డిమాండ్ చేశారు. సన్న, చిన్నకారు రైతుల భూముల్ని ప్రాజెక్టు లేకుండా అనవసరంగా తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ‘‘మా భూముల్ని ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ నుంచి పూర్తిగా తప్పించండి. 2014లో రాజధాని రాకముందే ఉండవల్లి హై లెవెల్లో ఉంది. తాడేపల్లి తర్వాత టాప్ ఊరు ఉండవల్లి గ్రామం అని రైతులు అన్నారు.
మా సమస్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిస్తే తప్పేంటి? అంటూ రైతులు ప్రశ్నించారు. వైఎస్ జగన్ని కలిశామనే అక్కసుతో తమను టార్గెట్ చేస్తున్నారంటూ రైతులు మండిపడ్డారు. తమ సమస్యను రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేశారు. కులం పేరుతో దుష్ప్రచారం చేయడం దుర్మార్గం. కావాలనే తమపై సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. రాజధాని నుంచి ఉండవల్లిని మినహాయించాలి. ఉండవల్లిలో వెంటనే భూసేకరణ నిలిపేయాలి. ఇంకా మేము భూములు ఇచ్చే పరిస్థితి లేదని రైతులు తేల్చిచెప్పారు.


