అర్హులందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం
ఆరోగ్యశ్రీ ట్రస్టు జేఈవో డాక్టర్ శ్రీదేవి
గుంటూరు మెడికల్: అర్హులందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ఫీల్డ్ ఆపరేషన్స్ సర్వీసెస్ జేఈవో డాక్టర్ శ్రీదేవి అన్నారు. సోమవారం గుంటూరు జీజీహెచ్లో ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ నాగళ్ల జయరామకృష్ణ అధ్యక్షతన ఆరోగ్యమిత్రలు, టీమ్ లీడర్లు, ఎంఎల్హెచ్పీలకు శిక్షణ కార్యక్రమం జరిగింది.
శ్రీదేవి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 2,446 జబ్బులకు, 1,973 నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్తోపాటు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ట్రస్టు పీఎంయూ జీఎం అంకయ్య, నరసరావుపేట ఆరోగ్య కో–ఆర్డినేటర్ డాక్టర్ పి.సునీల, జిల్లా మేనేజర్ సి.హెచ్.రవికిషోర్ తదితరులు పాల్గొన్నారు.