18–59 ఏళ్ల వారికి ఉచితంగా ప్రికాషన్‌ డోస్‌ 

Corona Virus Precaution vaccine dose distribution free of charge - Sakshi

నేటి నుంచి ఉచితంగా  ప్రికాషన్‌ డోస్‌  

18–59 ఏళ్ల వారికి అన్ని ప్రభుత్వ వ్యాక్సిన్‌ కేంద్రాల్లో టీకా  

సెప్టెంబర్‌ నెలాఖరు వరకూ స్పెషల్‌ డ్రైవ్‌ 

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ కట్టడికి చేపడుతున్న టీకా ప్రక్రియలో మరో కీలక ఘట్టానికి అడుగు పడింది. దేశ వ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న తరుణంలో 18 నుంచి 59 ఏళ్ల వయసు వారికి ఉచితంగా ప్రికాషన్‌ టీకా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో శుక్రవారం నుంచి రాష్ట్రంలో 18 నుంచి 59 ఏళ్ల వారికి ప్రికాషన్‌ డోస్‌ పంపిణీకి ఏర్పాట్లు చేసింది.

ఇప్పటి వరకూ హెల్త్‌ కేర్, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఉచితంగా ప్రభుత్వం ప్రికాషన్‌ డోస్‌ పంపిణీ చేస్తోంది. 18 నుంచి 59 ఏళ్ల వారు డబ్బు చెల్లించి ప్రైవేటు టీకా కేంద్రాల్లో ప్రికాషన్‌ డోస్‌ పొందేందుకు అవకాశం కల్పించింది. అయితే ఈ వర్గాల వారు ఇప్పటి వరకూ 20 మంది వరకూ మాత్రమే రాష్ట్రంలో ప్రికాషన్‌ డోస్‌ వేయించుకున్నారు. 

75 రోజుల పాటు..     
18 నుంచి 59 ఏళ్ల వారికి ఉచితంగా ప్రికాషన్‌ టీకా పంపిణీకి శుక్రవారం నుంచి సెప్టెంబర్‌ నెలాఖరు వరకూ వైద్య శాఖ ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టనుంది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా 75 రోజుల పాటు డ్రైవ్‌ నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వాస్పత్రులు, గ్రామ/వార్డు సచివాలయాల్లో, టీకా కేంద్రాల్లో ఉచితంగా ప్రికాషన్‌ టీకా వేస్తారు.

రెండో డోసు టీకా తీసుకుని 6 నెలలు దాటిన వారందరూ ప్రికాషన్‌ డోస్‌కు అర్హులు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 18 నుంచి 59 ఏళ్ల వయసున్న 3,50,94,882 మందికి రెండు డోసుల టీకాను వైద్య శాఖ వేసింది. వీరిలో సెప్టెంబర్‌ నెలాఖరుకు 3.41లక్షల మంది ప్రికాషన్‌ డోస్‌ తీసుకునేందుకు అర్హత కలిగి ఉంటారు. వీరందరికీ గడువులోగా టీకా పంపిణీకి వైద్య శాఖ చర్యలు తీసుకుంటోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top