కుట్టు స్కీమ్‌.. రూ. 150 కోట్ల స్కామ్‌! | Chandrababu Govt Scam in tailoring training for women with Sewing machines | Sakshi
Sakshi News home page

కుట్టు స్కీమ్‌.. రూ. 150 కోట్ల స్కామ్‌!

May 4 2025 5:01 AM | Updated on May 4 2025 11:18 AM

Chandrababu Govt Scam in tailoring training for women with Sewing machines

కృష్ణా జిల్లా కంకిపాడులోని శిక్షణా కేంద్రంలో తుప్పుపట్టి.. పెడల్‌ విరిగిపోయి ఉన్న కుట్టు మిషన్‌

రూ.257 కోట్ల పథకంలో దోపిడీకి ముఖ్య నేత పన్నాగం

ఆయన ఆశీస్సులతో చక్రం తిప్పిన చంద్రగిరికి చెందిన నేత 

మహిళలకు టైలరింగ్‌ శిక్షణలో స్కామ్‌ 

స్కీం అంచనాలు అమాంతం పెంపు 

టెండర్ల దశ నుంచే పలు అక్రమాలు 

తక్కువ కోట్‌ చేసిన సంస్థను కాదని మిగతా రెండు సంస్థలకు కాంట్రాక్టు 

సిండికేటుగా మారిన 2 కంపెనీలు 

ఈ మేరకు ముఖ్య నేతతో ముందే ఒప్పందం 

రాష్ట్రంలో అరకొరగా శిక్షణ కేంద్రాలు 

అవి కూడా ప్రభుత్వ భవనాల్లోనే..! 

మహిళలకు కుట్టు మెషిన్లు, పరికరాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు చూపుతున్న వైనం 

‘మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌’ పంచుకునే ఎత్తు 

నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లకు ముందస్తు చెల్లింపునకు సిద్ధం 

ఒప్పందంలో లేకున్నా రూ.25 కోట్ల అడ్వాన్సులకు ప్రతిపాదనలు 

మంత్రి సంతకం మాత్రమే మిగిలింది

తొలుత రూ.వంద కోట్లతో మాత్రమే ప్రతిపాదన..! ఆపై అంచనాలు అమాంతం రూ.257 కోట్లకు పెంపు..! 
టెండర్‌ నుంచి శిక్షణ వరకు దోపిడీకి వీలుగా పథకం..! అనంతరం పదుల సంఖ్యలో కూడా లేని లబ్ధిదారులను భారీగా ఉన్నట్టు చూపించి.. అరకొరగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి.. వారికి పరికరాలు, మెషిన్‌ ఇవ్వకుండానే ఇచ్చినట్టు చెప్పుకొంటూ చంద్రబాబు ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపింది. దాదాపు రూ.154 కోట్లకు పైగా దండుకోవడానికి సిద్ధమైంది.  

కంకిపాడు నుంచి సాక్షి ప్రతినిధి: చంద్రబాబు ప్రభుత్వం తన అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్టు వ్యవహరిస్తోంది. బీసీలు, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్‌), కాపు మహిళలకు ఇచ్చే కుట్టు శిక్షణలోనూ రూ.154 కోట్లకు పైగా కొల్లగొట్టడానికి పథకం వేసింది. రాష్ట్రంలో 1,02,832 మంది మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందించే పేరుతో చేపట్టిన స్కీమ్‌లో దోపిడీకి తెగబడుతోంది. 

ముఖ్య నేత సమక్షంలో జరిగిన ముందస్తు ఒప్పందాలతోనే ఈ స్కీమ్‌ను తెరమీదకు తెచ్చారని తెలుస్తోంది. ఇందులో ముఖ్య నేత నుంచి సంబంధిత శాఖ మంత్రి, అధికారుల వరకు ఎవరి వాటా ఎంత అనేది ఒప్పందాలు కుదుర్చుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలకు కుట్టు శిక్షణ పథకానికి సంబంధించి ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశోధనలో విస్మయకర అంశాలు వెలుగుచూశాయి. 

– అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న రాష్ట్రంలో లక్ష మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 175 నియోజకవర్గాల్లోనూ మూడు నుంచి ఐదు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎంపిక చేసిన మహిళలకు శిక్షణ ఇస్తామన్నారు. ఇది జరిగి 45 రోజులు దాటినా 50 నియోజకవర్గాల్లో కూడా శిక్షణ మొదలుకాలేదు. ఆ పేరుతో రూ.వంద కోట్లకుపైగా కొల్లగొట్టే కార్యక్రమం మాత్రం నిర్విఘ్నంగా సాగుతోంది.

టెండర్ల దశ నుంచే మాయాజాలం
టెండర్లలో తక్కువ మొత్తానికి కోట్‌ చేసిన సంస్థకు కాంట్రాక్టును ఖరారు చేస్తారని తెలిసిందే. కానీ, అందుకు విరుద్ధంగా.. తక్కువ కోట్‌ చేసినవారితో పాటు అంతకంటే ఎక్కువకు కోట్‌ చేసిన మరో రెండు సంస్థలను కలిపి రంగంలోకి దించారు. ప్రి బిడ్‌లో మొత్తం 65 కంపెనీలు పాల్గొంటే 56 సంస్థలను ముందే తిరస్కరించారు. విచిత్రం ఏమంటే.. కుట్టు శిక్షణలో విశేష అనుభవంతో పాన్‌ ఇండియా కంపెనీగా గుర్తింపున్న ఐసీఏ కూడా ఇందులో ఉండడం. మిగిలిన 9 కంపెనీల్లో ఆరు సంస్థల టెండర్లను తెరవకముందే తమదైన శైలిలో పక్కకు తప్పించేశారు. అంటే.. మొత్తం 65 కంపెనీల్లో 62ను తొలగించేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం కావడం గమనార్హం.

ఎల్‌1కు 5 శాతమే పని.. 
చంద్రబాబు ప్రభుత్వం తమవారికి శిక్షణ కాంట్రాక్టు అప్పగించడానికి ఇన్ని అడ్డంకులు పెట్టినా తట్టుకుని.. శ్రీ టెక్నాలజీ తక్కువ మొత్తానికి కోట్‌ చేసి ఎల్‌1గా నిలిచింది. కానీ, దానిని బెదిరించి 5 శాతం పని మాత్రమే అప్పగించారు. కీలక నేత ప్రమేయంతో.. ఎల్‌2, ఎల్‌3గా నిలిచిన సంస్థలకు మాత్రం 95 శాతం పని ఇచ్చారు. ఈ రెండు సంస్థలు (ఎల్‌2, ఎల్‌3) సిండికేట్‌ కావడం మరో ట్విస్ట్‌.

శిక్షణ ముసుగులో..
ఒక్కో మహిళ (యూనిట్‌) శిక్షణకు రూ.21,798 కేటాయించారు. ఇందులో టైలరింగ్‌లో శిక్షణ, టైలరింగ్‌ కేంద్రానికి అద్దె, మహిళకు కుట్టు మిషన్, ఇతర పరికరాల పంపిణీ వంటివి ఉన్నాయి. ఒక్కో మహిళకు 360 గంటల పాటు ఉచిత శిక్షణ ఇవ్వాలి. రోజుకు 4 గంటలు చొప్పున 90 రోజులు, 6 గంటలు చొప్పున 60 రోజులు, 8 గంటలు చొప్పున 45 రోజులు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. కానీ, ఎక్కడా ఇది అమలవడం లేదు. పైగా శిక్షణకు అవసరమైన టేప్, కత్తెర, స్కేల్‌ తదితర పరికరాల కిట్‌ను కూడా లబ్ధిదారులనే తెచ్చుకోమంటున్నారు.

–కుట్టు మిషన్లు కూడా ప్రముఖ కంపెనీలైన ఉషా, మెరిట్, సింగార్, పూజా తదితర కంపెనీలవి కాకుండా అతి తక్కువ ధరకు గుజరాత్‌లో తయారు చేసినవి అంటగడుతున్నారు. ఈ మొత్తాన్ని కాంట్రాక్టర్లే మిగుల్చుకుంటున్నారు.
–శిక్షణ కేంద్రాలను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేశారు. కానీ, వాటిని అద్దెకు తీసుకుని నడుపుతున్నట్లు చెబుతూ కాంట్రాక్టర్లు భారీగా వెనకేసుకుంటున్నారు. శిక్షణ కేంద్రాల్లో మహిళలకు తాగు నీరు, బాత్‌రూమ్‌ కూడా లేవు. 
–శిక్షణ చాలాచోట్ల శిక్షణ అంతంతమాత్రంగానే జరుగుతోంది. శిక్షకులు లేరనో.. లబ్ధిదారులు తగినంతమంది లేరనో చెబుతున్నారు. వాస్తవం ఏమంటే.. అరకొర సెంటర్లు ఏర్పాటు చేసి, అంతంతమాత్రంగా శిక్షణ ఇచ్చి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టడమే లక్ష్యంగా కాంట్రాక్టర్లు కథ నడిపిస్తున్నారు.

ప్రముఖ సంస్థలను తోసిరాజని..
కుట్టు శిక్షణ ఇచ్చేందుకు సొసైటీ ఫర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రైజ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌ (సీడాప్‌), ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక, సాంకేతిక కన్సల్టెన్సీ సంస్థ (ఏపీఐటీసీవో)తో పాటు కేంద్ర సంస్థ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ్‌ కౌశల్‌ యోజన (డీడీయూజీకేవై) ఉన్నాయి. వీటికి శిక్షణ కేంద్రాలు, శిక్షణ భాగస్వాములు ఉన్నారు. స్కిల్‌ పోర్టల్స్, అన్ని జిల్లాల్లో పర్యవేక్షణ వ్యవస్థ, సిబ్బంది సైతం ఉన్నారు. అయినా వాటిని కాదని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సహకార ఆర్థిక సంస్థ ద్వారా స్కీమ్‌ను చేపట్టడం భారీ స్కామ్‌కు మార్గం సుగమం చేసుకోవడమేననే ఆరోపణలు వస్తున్నాయి.

ప్రభుత్వ వైఫల్యం.. నిర్లక్ష్యానికి నిలువుటద్దం
–సాక్షి క్షేత్ర స్థాయి పరిశీలనలో తేటతెల్లం
కృష్ణా జిల్లా కంకిపాడులోని మహిళా శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్‌) ప్రాజెక్ట్‌ కార్యాలయం పై అంతస్తులోని టైలరింగ్‌ శిక్షణ కేంద్రాన్ని ‘సాక్షి’ పరిశీలించింది. ఇక్కడ 140 మందిని ఎంపిక చేసి ఉదయం 70, మధ్యాహ్నం 70 మందికి శిక్షణ ఇస్తున్నట్టు  చెబుతున్నారు. ‘సాక్షి’ ప్రతినిధి ఏప్రిల్‌ 19న ఉదయం 11 గంటలకు వెళితే 16 మందే ఉన్నారు. మిషన్లు కూడా 20 మాత్రమే. బాగా పాతవైన ఇవి తుప్పుపట్టాయి. వచ్చినవారిలో ముగ్గురు అరగంటలోనే వెళ్లిపోయారు. మరో అరగంటకు 9 మంది వచ్చారు. శిక్షణ లేకపోవడంతో కబుర్లు చెప్పుకొంటూ కనిపించారు. కనీసం క్లాత్‌ కటింగ్‌కు బల్ల కూడా లేదు. కోలవెన్ను నుంచి రోజూ ఆటోలో వచ్చి వెళ్లడానికి రూ.వంద అవుతోందని పలువురు  వాపోయారు. 

– కృష్ణా జిల్లా బంటుమిల్లిలో 138 మందిని ఎంపిక చేసినట్టు చెబుతున్నా.. కనీసం కుట్టు మిషన్లు కూడా లేవు. ఈ సెంటర్‌కు ఒక శిక్షకురాలితో పాటు వచ్చింది ఇద్దరే. మచిలీపట్నంలో మరీ చిత్రం ఐదు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ఏ ఒక్క కేంద్రంలోనూ శిక్షణ మొదలులేదు.
ఎమ్మెల్యే కార్యాలయంలోనే శిక్షణ కేంద్రం పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ ఏకంగా తన కార్యాలయంలోనే దర్జీ శిక్షణ కేంద్రం పెట్టుకున్నారు. శిక్షణ ఇవ్వకున్నా ఎవరూ అడగరని, తమ పార్టీ వాళ్లకే ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వొచ్చని ఇలా చేశారని అంటున్నారు. కుట్టు శిక్షణ కేంద్రం ఎక్కడుందని పెనమలూరు ఎంపీడీవో బండి ప్రణవిని వివరణ కోరగా ఎమ్మెల్యే కార్యాలయంలో అని చెప్పడం గమనార్హం.

రూ.257 కోట్లు స్కీ (స్కా)మ్‌ ఇలా.. 
–మొదట యూనిట్‌కు రూ.25 వేలు చొప్పున మొత్తం రూ.257 కోట్లు ప్రతిపాదించారు
–టెండర్‌లో యూనిట్‌కు రూ.21,500 వంతున 1,02,832 మంది మహిళలకు మొత్తం రూ.221,08,88,000
–ఇందులో ఒక్కో కుట్టు మిషన్‌ రూ.4,300 లెక్కన: రూ.44,21,77,600
–ఒక్కొక్కరికి శిక్షణ కోసం రూ.3 వేలు చొప్పున: రూ.30,84,96,000
–ఒక్కొక్కరికి కుట్టు మిషన్, శిక్షణ కలిపి: రూ.7,300. ఈ ప్రకారం మొత్తం అయ్యేది 75,06,73,600.
–రూ.221,08,88,000 కోట్లలో రూ.75,06,73,600 కోట్లు పోగా 146,02,14,400 స్కామ్‌ 

ఒక్క కుట్టు మిషన్‌కు ఏ సంస్థ ఎంతకు కోట్‌ చేసిందంటే..?
–శ్రీ టెక్నాలజీ ఇండియా(ఎల్‌ఎల్‌పీ)–హైదరాబాద్‌ రూ.21,798
–సోషల్‌ ఏజెన్సీ ఫర్‌ పీపుల్స్‌ ఎంపవర్‌మెంట్‌–హైదరాబాద్‌ రూ.23,400
–సెంటర్‌ ఫర్‌ అర్బన్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌–హైదరాబాద్‌ రూ.23,500

మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ ఇవ్వండి.. పంచుకుందాం
నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లకు ముందస్తు చెల్లింపునకు సిద్ధం
ఒప్పందంలో లేకున్నా రూ.25 కోట్ల అడ్వాన్సులకు ప్రతిపాదనలు
మంత్రి సంతకం మాత్రమే మిగిలింది.. తర్వాత పంచుకు తినడమే 
శిక్షణ పేరుతో 50 రోజుల్లోనే మొత్తం దండుకునేందుకు సిద్ధం

రాష్ట్రవ్యాప్తంగా ఇంకా పూర్తిస్థాయిలో కుట్టు శిక్షణే ప్రారంభం కాలేదు. మొబిలైజేషన్‌ అడ్వాన్సు కింద రూ.25 కోట్లను కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. స్కీమ్‌కు సంబంధించి టెండర్‌ ఖరారై ఒప్పందం కుదిరిన మరుక్షణం నుంచే అడ్వాన్సుల కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. తొలుత రూ.60 కోట్ల అడ్వాన్సుల కోసం ప్రయత్నించి భంగపడిన కాంట్రాక్టర్లు తాజాగా రూ.25 కోట్లను రాబట్టుకోబోతున్నారు. ఈ మేరకు కాంట్రాక్టర్లు పొలిటికల్‌ బాస్‌కు రాయబారం పంపి అనుకున్నది సాధించారు. 

తద్వారా తమ వాటాల వసూలుకు ముఖ్య నేతలు మార్గం సుగమం చేసుకుంటున్నారని సమాచారం. నీకింత.. నాకింత తరహాలో పంచుకోవడానికి కాంట్రాక్టర్లతో కలిసి ముఖ్య నేతలు సిద్ధమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అడ్వాన్సులిస్తే తమ మెడకు చుట్టుకుంటుందని అధికారులు ససేమిరా అంటున్నా.. వారిని దారికి తెచ్చుకుని పని చక్కబెట్టడానికి ‘పొలిటికల్‌ బాస్‌’ సరే అన్నారని సమాచారం. 

టెండర్‌ నిబంధనలకు విరుద్ధంగా..
వాస్తవానికి బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు మహిళలకు టైలరింగ్‌ శిక్షణ ప్రారంభమైన 15 రోజులకు 33 శాతం, 30 రోజులకు మరో 33 శాతం, 50 రోజులకు మిగిలిన 33 శాతం బిల్లులు చెల్లించేలా టెండర్‌లో పేర్కొన్నారు. అంటే.. శిక్షణ పేరుతో 50 రోజుల్లోనే మొత్తం బిల్లులు కింద లాగేసేందుకు పథకం రూపొందించారు. 

పై నుంచి ఆమోదం లభించడంతో బీసీ, కాపు కార్పొరేషన్ల అధికారులు మొబిలైజేషన్‌ అడ్వాన్సుల కోసం ఫైల్‌ పెట్టారు. ఉన్నతాధికారులు సైతం రూల్‌ పొజిషన్‌కు సంబంధించి ఏ కామెంట్లు లేకుండానే యథాతథంగా మంత్రి సవితకు పంపారు. ఆమె సంతకం చేస్తే కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్సులు చెల్లిస్తారు. ఇక నీకింత.. నాకింత అని పంచుకోవడమే అని పలు శాఖల సిబ్బంది చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement