పిఠాపురం వర్మకు బాబు వెన్నుపోటు | Chandrababu Big Shock To Pithapuram Varma | Sakshi
Sakshi News home page

పిఠాపురం వర్మకు బాబు వెన్నుపోటు

May 7 2026 11:42 AM | Updated on May 7 2026 12:50 PM

Chandrababu Big Shock To Pithapuram Varma

సాక్షి, విజయవాడ: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే  వత్సవాయి సత్యనారాయణ వర్మకి తెలుగు దేశం పార్టీ అధిష్టానం షాకిచ్చింది. ఆయన్ని టీడీపీ ఇంచార్జ్‌ బాధ్యతల నుంచి తప్పిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఎంత విధేయంగా ఉన్నా వర్మ  తీరుపై చంద్రబాబు ఎందుకనో తీవ్ర అసహనంతో ఉన్న సంగతి తెలిసిందే. 

పిఠాపురంలో అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి టీడీపీ-జనసేన మధ్య విబేధాలు ఉన్నాయి. సీట్ల పంపకాల టైంలో అది తారాస్థాయికి చేరింది. వర్మకు కాకుండా పొత్తు ధర్మంలో భాగమంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు పిఠాపురం సీటును అప్పగించారు చంద్రబాబు. ఈ విషయంలో అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా అధినేత మాటకు లోబడి ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ సైలెంట్‌గా ఉండిపోయారు. పవన్‌ తరఫున ప్రచారం చేయించి మరీ గెలిపించారు. 

అయితే గెలిచాక కూడా ఇరు పార్టీల మధ్య వర్గ పోరు కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా ఫ్లెక్సీ వార్‌ ఆ గొడవను తారాస్థాయికి చేరింది. ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటో లేకపోవడంతో హర్టైన వర్మ.. జనసేన వర్గీయులతో వాగ్వాదానికి దిగారు. ఇది దాదాపుగా ఆయనపై దాడి చేసేంత దాకా వెళ్లింది. ఆ టైంలో.. చంద్రబాబు మాట మీద తాము మౌనంగా ఉన్నామని.. ఇక మీదట పరిస్థితి మరోలా ఉంటుందంటూ ఆయన ఆవేశంగా మాట్లాడారు. 

ఇది చంద్రబాబుకి ఎందుకనో సహించలేదు. పార్టీ మీటింగ్‌లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ పరోక్షంగా వర్మను మందలించారు కూడా.  అయితే.. మొన్నీమధ్యే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో వర్మ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. 

పిఠాపురంలో వర్మ పదే పదే రచ్చ చేస్తున్నారని పవన్ ఫిర్యాదు చేయడంతో.. ఇప్పుడు ఆయన్ని ఇంచార్జ్‌ బాధత్యల నుంచి తప్పించాలని చంద్రబాబు నిర్ణయించారు. నియోజక వర్గంలో వ్యవహారాలను చూసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. 

ఈ పరిణామంపై వర్మ అనుచరులు రగిలిపోతున్నారు. అధినేత కోసం వర్మ అంతలా ఆరాటపడితే.. పవన్‌ చెప్పుడు మాటలు విని ఇలా చేయడం ఏంటని బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్మ నిర్ణయం ఎలా ఉండబోతోందా? అనే ఉత్కంఠ పిఠాపురంలో నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement