సుస్థిర అభివృద్ధిలో దూసుకుపోతున్న ఏపీ | Challa Madhu Comments On Union Budget 2022 | Sakshi
Sakshi News home page

సుస్థిర అభివృద్ధిలో దూసుకుపోతున్న ఏపీ

Feb 2 2022 3:22 AM | Updated on Feb 2 2022 3:22 AM

Challa Madhu Comments On Union Budget 2022 - Sakshi

సాక్షి, అమరావతి: సుస్థిర అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోందని ప్రభుత్వ సలహాదారు (స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌) సలహాదారు చల్లా మధు తెలిపారు. ఎకనామిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ర్యాంకింగ్స్‌లో సుస్థిర అభివృద్ధిలో 72 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్‌ 4వ స్థానంలో నిలిచిందని చెప్పారు. తాడేపల్లిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నీతి ఆయోగ్‌ విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి 2020–21లో దేశంలో కోస్తా రాష్ట్రాల్లో ఒడిశా తర్వాతి స్థానాన్ని ఏపీ దక్కించుకొందన్నారు.

రాష్ట్రంలో అనేక సంస్కరణలు ప్రవేశపెడుతూ సంక్షేమం, అభివృద్ధి పరంగా ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శక్తివంతంగా మారుతుండటాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. ప్రభుత్వంపైన, వైఎస్సార్‌సీపీ పైనా ఎల్లో మీడియా బలంతో దుర్మార్గమైన కుట్ర, కుతంత్రాలతో అధికారమే పరమావధిగా టీడీపీ దుష్ప్రచారానికి ఒడిగడుతోందన్నారు. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన ర్యాంకులను చూసిన తర్వాత అయినా చంద్రబాబు, ఆయన కుమారుడు, టీడీపీ నేతలు వారి తీరు మార్చుకోవాలని హితవు పలికారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం ఓ విప్లవాత్మక చర్య అని అన్నారు. చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో చేయలేనిది వైఎస్‌ జగన్‌ సీఎంగా రెండున్నరేళ్లలో చేసి చూపారని తెలిపారు. 

కేంద్ర బడ్జెట్‌ రాష్ట్రాలకు ప్రయోజనకారి కాదు
కేంద్ర బడ్జెట్‌ పూర్తిగా నిరుత్సాహపరిచిందని చెప్పారు. ఈ బడ్జెట్‌ రాష్ట్రాలకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేదన్నారు. రాష్ట్రానికి సంబంధించిన చాలా విషయాలపై ఎలాంటి ప్రస్తావనా చేయలేదని తెలిపారు. చూడటానికి మేడిపండులా ఉన్నా, అందులో ఏమీ లేదని తెలిపారు. ఆర్థిక మంత్రి చెప్పిన సబ్‌ కా వికాస్‌ అస్సలు లేదన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా అత్యల్పంగా ఉందన్నారు. రాష్ట్రాలకు మూలధన వ్యయం కింద లక్ష కోట్లు ఇస్తామన్నారని, ఇప్పుడున్న ఫార్ములా మేరకు రాష్ట్రానికి రూ.4 వేల కోట్లే వస్తుందన్నారు. వెంటనే ఆ ఫార్ములాను సవరించి, రాష్ట్ర వాటా పెంచాలని ఆయన డిమాండ్‌ చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement