బాబు హయాంలో మద్యం సిండికేట్లకు సలాం | CAG Report On Chandrababu Govt Irregularities In Liquor | Sakshi
Sakshi News home page

బాబు హయాంలో మద్యం సిండికేట్లకు సలాం

Dec 6 2020 4:22 AM | Updated on Dec 6 2020 4:22 AM

CAG Report On Chandrababu Govt Irregularities In Liquor - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో ఎక్సైజ్‌ శాఖలో జరిగిన అవినీతిని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) తూర్పారబట్టింది. లోపభూయిష్టంగా జరిగిన పన్నుల వసూళ్లు, నమోదైన కేసుల్లో అవకతవకలను ఎత్తి చూపింది. మద్యం సిండికేట్లకు అనుకూలంగా వ్యవహరించి.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు కాగ్‌ తేల్చింది. రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖలో ఆడిట్‌ చేయాల్సిన కార్యాలయాలు 103 ఉండగా.. 2017–18 ఆర్థిక సంవత్సరంలో కాగ్‌ 14 కార్యాలయాలను మచ్చుకు తనిఖీ చేసింది. మొత్తం 41 కేసుల్లో రూ.6.71 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు నిర్ధారించింది. అంటే మిగిలిన కార్యాలయాల్లో ఎంత మేర అక్రమాలు జరిగి ఉంటాయో ఊహించుకోవచ్చని కాగ్‌ పేర్కొంది. కాగ్‌ ఎత్తి చూపిన తప్పులను ఎక్సైజ్‌ శాఖ కూడా అంగీకరించడం గమనార్హం. 

ఇష్టానుసారంగా అనుమతులు..: రాష్ట్రంలోని పలు గ్రామాలను సమీప నగర పాలక/పురపాలక సంస్థల్లో విలీనం చేశారు. ఇక్కడి మద్యం షాపులకు అదనపు లైసెన్సు ఫీజులు వసూలు చేయాలి. కానీ ఎక్సైజ్‌ శాఖ దీన్ని పట్టించుకోలేదు. కాగ్‌ తనిఖీ చేసిన సామర్లకోట మున్సిపాలిటీ, కాకినాడ, రాజమండ్రి కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాలకు సంబంధించి ప్రభుత్వానికి రావాల్సిన రూ.2.01 కోట్ల ఆదాయానికి గండి కొట్టారు. పర్మిట్‌ రూంలకు ఫీజులు వసూలు చేయకుండా మద్యం సిండికేట్లతో కుమ్మక్కై రూ.3.16 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు.


అలాగే బార్లను అనుమతించిన విస్తీర్ణంలో కాకుండా.. బ్లూ ప్రింట్‌ను మించి వ్యాపారం నడిపినా పట్టించుకోలేదు. వీటికి అదనపు రుసుం వసూలు చేయలేదు. కాకినాడ, ఒంగోలు, రాజమండ్రిలో 13 మంది లైసెన్సుదారులకు రూ.94.11 లక్షల అదనపు ఫీజు విధించలేదు. ఇక కల్లు చెట్లకు వర్తించే రేట్లను తక్కువగా చేసి చూపడంతో రూ.28.89 లక్షల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. కాకినాడ, ఏలూరు, రాజమండ్రి, విజయనగరంలో కల్లు చెట్లకు అద్దెలను తక్కువగా విధించినట్లు కాగ్‌ తేల్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement