బెయిలిస్తే సాక్షులను ఎలా ప్రభావితం చేస్తారో చెప్పండి | Andhra Pradesh High Court Orders CID In Jatwani Case Against PSR Anjaneyulu, More Details Inside | Sakshi
Sakshi News home page

బెయిలిస్తే సాక్షులను ఎలా ప్రభావితం చేస్తారో చెప్పండి

May 23 2025 5:49 AM | Updated on May 23 2025 11:35 AM

Andhra pradesh High Court orders CID in Jatwani case against PSR Anjaneyulu

దర్యాప్తునకు ఏ విధంగా ఆటంకం కలిగిస్తారు?

పీఎస్సార్‌పై జత్వానీ కేసులో సీఐడీకి హైకోర్టు ఆదేశం

శాఖాపరమైన విచారణలో చెప్పినదాన్ని పరిగణనలోకి తీసుకోం

అదేమైనా సీఆర్‌పీసీ సెక్షన్‌ 161 లేదా 164 వాంగ్మూలమా? 

ఇది తప్పుడు కేసు అని సంబంధిత కోర్టు ఇప్పటికే అభిప్రాయపడింది

విచారణను ఎలా అడ్డుకుంటారో చెప్పాలని ఏజీకి స్పష్టీకరణ

ఏపీపీఎస్‌సీ కేసులోనూ పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశం

సాక్షి, అమరావతి: సినీనటి కాదంబరి జత్వానీ ఫిర్యా­దు మేరకు ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్సార్‌ ఆంజనేయులుకు బెయిల్‌ ఇస్తే ఆయన సాక్షులను ఎలా ప్రభావితం చేయగలరో, దర్యాప్తు­నకు ఏ విధంగా ఆటంకం కలిగించగలరో చెప్పాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. దీని ఆధారంగా బెయిల్‌ మంజూరుపై నిర్ణయం తీసుకుంటామంది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ కేసులో బెయిల్‌ కోరుతూ పీఎస్సార్‌ ఆంజనేయులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్‌ లక్ష్మణరావు వి­చారణ జరిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎస్‌.నాగేష్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ, గత 30 రోజులుగా పీఎస్సార్‌ ఆంజనేయులు జైల్లో ఉ­న్నా­రని తెలిపారు. దర్యాప్తు పూర్తయింద­న్నారు. ఆధా­రా­లన్నీ సేకరించిన నేపథ్యంలో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశమే లేద­న్నా­రు.

దర్యాప్తును ఎలా అడ్డుకుంటారు?
సీఐడీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మా­ల­పా­టి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ, ఫిర్యాదుదారు జత్వా­నీకి విరుద్ధంగా ఆంజనేయులు, ఇతర అధికా­రులు కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. ఇదే విష­యా­న్ని ఈ కుట్రలో పాలుపంచుకున్న మరో ఐపీఎస్‌ అ«ధికారి విశాల్‌ గున్నీ శాఖాపరమైన విచారణ సందర్భంగా చెప్పా­రని తెలి­పారు. ఆంజనే­యు­లుకు బెయిల్‌ మంజూరు చేస్తే సా­క్షు­­లను ప్రభావితం చేయడంతో పాటు సాక్ష్యా­లను తా­రు­­మారు చేస్తా­రన్నారు. ఈ సమయంలో న్యాయ­మూర్తి స్పందిస్తూ, శాఖాపరమైన విచా­రణలో చెప్పిన వివ­రా­లను తామెలా పరిగణనలోకి తీసుకుంటామని ప్రశ్నించా­రు.

సీఆర్‌పీసీ సెక్షన్‌ 161 లేదా 164 వాంగ్మూలం అయి ఉంటే దానిని పరిగ­ణ­నలోకి తీసుకుని ఉండేవారమన్నారు. ఈ కేసు తప్పుడు కేసు అని సంబంధిత కోర్టు ఇప్పటికే అభి­ప్రా­యపడిందని గుర్తు చేశా­రు. పిటిషనర్‌కు బెయిల్‌ ఇస్తే ఆయన సాక్షులను ఎలా ప్రభావితం చేస్తా­రో, దర్యా­ప్తును ఏ విధంగా అడ్డు­కుంటారో చెప్పాలని అడ్వొకేట్‌ జనరల్‌కు స్పష్టం చేశారు. దీని ఆధా­రంగా బెయిల్‌పై నిర్ణ­యం తీసుకుంటామని, అవస­రమైన కఠిన షర­తులు విధి­స్తామని తెలి­­పారు. విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. 

పీఎస్సార్‌పై ఏపీపీఎస్సీ కేసులో పూర్తి వివరాలు సమర్పించండి
ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు, నిధుల దుర్విని­యోగం ఆరోపణలపై సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఏపీపీఎస్‌సీ అప్పటి అదనపు కార్యదర్శి పెండ్యాల సీతారామాంజనే­యు­లుపై విజయ­వాడ సూర్యా­రావు­పేట పోలీసులు నమోదు చేసిన కేసులో పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు పోలీసు­లను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ యడవల్లి లక్ష్మణ­రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు­లో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని సీతా­రామా­ంజనేయులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

తనపై పోలీసులు చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైన­వని, తాను అమాయ­కుడినని పీఎస్సార్‌ ఆంజనేయులు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. కాగా, ఏపీపీఎస్సీ మూల్యాంకనం కేసులో పీఎస్సార్‌ ఆంజనేయులు రిమాండ్‌ గురువారంతో ముగిసింది. దీంతో ఆయన్ను పోలీసులు 2వ అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ న్యాయస్థానంలో హాజరు పరిచారు. వచ్చేనెల 5వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement