ఆల్మట్టి డ్యామ్‌ గేట్లు ఎత్తివేత

Almatti Dam gates was lifted - Sakshi

కృష్ణా, మలప్రభ, ఘటప్రభల నుంచి భారీ వరద

దిగువకు 1.80 లక్షల క్యూసెక్కులు విడుదల

సాక్షి, అమరావతి/ శ్రీశైలం ప్రాజెక్ట్‌/ బెంగళూరు: కృష్ణా, ఉప నదులు మలప్రభ, ఘటప్రభల నుంచి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు 1,41,389 క్యూసెక్కులు చేరుతుండటం, వరద ఉద్ధృతి గంట గంటకూ పెరుగుతుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఎంఏ) మార్గదర్శకాల మేరకు కర్ణాటక సర్కార్‌ ఆల్మట్టి డ్యామ్‌ గేట్లు ఎత్తివేసింది. దిగువకు 1.80 లక్షల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ఆ ప్రవాహం నారాయణపూర్‌ డ్యామ్‌లోకి చేరుతుండటంతో.. ముందు జాగ్రత్త చర్యగా డ్యామ్‌ను ఖాళీ చేస్తూ దిగువకు 1,87,678 క్యూసెక్కులు వదిలేస్తున్నారు.

► ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలంలోకి గంట గంటకూ వరద ప్రవాహం పెరుగుతోంది. ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగిస్తూ 38,140 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
► అప్పర్‌ తుంగ, భద్ర డ్యామ్‌లు నిండటంతో వరద నీటిని విడుదల చేస్తుండటంతో నీటి నిల్వ 49.78 టీఎంసీలకు చేరుకుంది. మరో 51 టీఎంసీల ప్రవాహం వస్తే తుంగభద్ర డ్యామ్‌ నిండిపోతుంది.
► పశ్చిమ కనుమల్లో శుక్రవారం విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో కృష్ణా, ఉప నదులకు శనివారం వరద ప్రవాహం పెరుగుతుందని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అంచనా వేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top