అమ్మా.. నేను సూర్యతో వెళ్లిపోతున్నా! | 22 year old girl missing in anantapur | Sakshi
Sakshi News home page

అమ్మా.. నేను సూర్యతో వెళ్లిపోతున్నా!

Dec 21 2024 1:46 PM | Updated on Dec 21 2024 1:51 PM

22 year old girl missing in anantapur

లేఖ రాసి అదృశ్యమైన యువతి

రాప్తాడు రూరల్‌: ‘అమ్మా నా కోసం ఎక్కడా వెతకొద్దు. ప్రేమించిన వ్యక్తి వద్దకు వెళ్తున్నా’ అంటూ లేఖ రాసి ఓ యువతి అదృశ్యమైన ఘటన గురువారం అనంతపురం రూరల్‌ మండలం కురుగుంటలో వెలుగు చూసింది. అనంతపురం రూరల్‌ పోలీసులు తెలిపిన మేరకు... కురుగుంటలో నివాసముంటున్న ముస్లిం దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త చనిపోయాడు. కుమారుడు బైకు మెకానిక్‌గా పని చేస్తుండగా, 22 ఏళ్ల వయసున్న కుమార్తె నగరంలోని ఓ షోరూంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ వదిలేసింది. ఈ క్రమంలో గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. 

సాయంత్రమైనా తిరిగి రాలేదు. దీంతో తల్లి ఇంట్లో పరిశీలించగా ఓ లేఖ లభించింది. అందులో ‘అమ్మా... నేను సూర్య అనే యువకుడిని ప్రేమించా. ఆయనతోనే వెళ్తున్నా. మీరు నా కోసం వెతకొద్దు. విజయవాడ వెళ్తున్నా. వాళ్ల అమ్మానాన్న కూడా నన్ను బాగా చూసుకుంటారు. ఇంట్లో బంగారు, డబ్బులేవీ తీసుకెళ్లడం లేదు. అన్నా... అమ్మను బాగా చూసుకో’ అంటూ రాసి ఉంది. ఈ లేఖను స్వాధీనం చేసుకున్న అనంతపురం రూరల్‌ పోలీసులు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

యువతి అదృశ్యం
కదిరి టౌన్‌: స్థానిక మున్సిపల్‌ పరిధిలోని రాజీవ్‌ నగర్‌లో నివాసముంటున్న యువతి కనిపించడం లేదు. ఈ మేరకు తల్లి ఫిర్యాదు చేయడంతో పట్టణ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. బంధువుల అబ్బాయితో ఈ నెల 18న ఎస్టీఎస్‌ఎన్‌ డిగ్రీ కళాశాల వెనుక ఉన్న ఫంక్షన్‌ హాల్‌లో ఆమెకు వివాహ నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. దీంతో బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ఆమె ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కదిరికి చెందిన మునివర్ధన్‌ (గజ), చిన్నాన్న పవన్‌ కారణమంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement