తొలిసారి హైకోర్టులో ఈ–లోక్ అదాలత్
187 కేసులు పరిష్కారం..
రూ.76.91 లక్షల పరిహారం ఖరారు
సాక్షి, అమరావతి: హైకోర్టులో శనివారం నిర్వహించిన ఈ–లోక్ అదాలత్లో 187 కేసులు పరిష్కారం అయ్యాయి. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న మోటారు వాహన ప్రమాద అప్పీళ్లను ఈ లోక్ అదాలత్లో పరిష్కరించారు. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ–లోక్ అదాలత్కు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ నైనాల జయసూర్య నేతృత్వం వహించారు.
192 కేసులు విచారణకు రాగా, అందులో ఇద్దరు న్యాయమూర్తులు 187 కేసులు పరిష్కరించారు. బాధితులకు రూ.76.91 లక్షలు పరిహారంగా నిర్ణయించారు. కరోనా నేపథ్యంలో హైకోర్టులో తొలిసారి ఈ–లోక్ అదాలత్ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ లోక్ అదాలత్ నిర్వహించారు. ఇందులో బీమా కంపెనీల ప్రతినిధులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. ఈ–లోక్ అదాలత్ విజయవంతం కావడానికి సహకరించినవారందరికీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఏవీ రమణకుమారి శనివారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.