కళ్యాణదుర్గం: ప్రజాప్రస్థానంలో భాగంగా వైఎస్ రాజశేఖరరెడ్డి 2003 ఏప్రిల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సుదీర్ఘంగా పాదయాత్ర సాగింది. శెట్టూరు, కంబదూరు, కళ్యాణదుర్గం, బ్రహ్మ సముద్రం మండలాల మీదుగా సాగిన ఈ యాత్రలో ఆయన రైతుల కష్టాలను, తాగు–సాగునీటి ఎద్దడిని ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజల జీవనాడి, ప్రధాన నీటి వనరైన భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ)ను తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్ఎల్సీ) ద్వారా నింపాలనే డిమాండ్ను పాదయాత్ర సమయంలో వైఎస్సార్ గుర్తించారు. సీఎం అయ్యాక 2007–08లో ఫ్లోరైడ్ సమస్య తీర్చేందుకు శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం విస్తరణకు, కంబదూరు, శెట్టూరు ప్రాంతాలకు తాగునీరు అందించే పలు రక్షిత మంచినీటి పథకాలకు నిధులు మంజూరు చేసిన ఘనత వైఎస్సార్కే దక్కింది. అందుకే ఆయన్ను మారుమూల పల్లెల్లో సైతం ప్రజలు ఇప్పటికీ స్మరించుకుంటూ ఉంటారు.


