వైభవంగా సునామ జకినీ మాత ఉత్సవాలు
గుత్తి: స్థానిక ఆర్ఎస్ రోడ్డులో వెలసిన ఆరె కటికల ఆరాధ్య దైవం సునామ జకినీ మాత, మల్కూమ జకినీ మాత ఆలయం వద్ద గురువారం సునామ జకినీ మాత జాతర ఘనంగా నిర్వహించారు. దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో గుత్తి జనసంద్రమైంది. ఆలయంలో తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభించారు. అనంతరం వందలాది మంది కన్యలు, ముత్తయిదువులు వాసవి, షిరిడి సాయిబాబా దేవాలయం వద్ద నుంచి పూర్ణ కుంభాలతో సునామ జకినీ మాత ఆలయం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్నారులు, కళాకారులు ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆలూరు లక్ష్మణ రావు, ధర్మకర్త సురేష్రావు, కార్యానిర్వాహక అధ్యక్షుడు సాయినాథ్, మహిళా అధ్యక్షురాలు సరస్వతీబాయి, ప్రధాన కార్యదర్శి భాస్కర్రావు, కోశాధికారి సుధాకర్రావు, ఉప కోశాధికారి బాబురావు, తదితరులు పాల్గొన్నారు.


