
పబ్లిక్ బోరు బావి కబ్జా
బ్రహ్మసముద్రం: ప్రజల దాహార్తీని తీర్చేందుకు వేయించిన బోరుబావిని ఆ గ్రామ టీడీపీ సర్పంచ్ కబ్జా చేశారు. ఇదేమని ప్రశ్నిస్తే.. ఇది తమ ప్రభుత్వమని... తానే బోరు వేయించానని బుకాయిస్తూ దౌర్జన్యానికి తెరలేపారు. స్థానికులు తెలిపిన మేరకు... బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లిలో తాగునీటి ఇబ్బంది తీవ్రంగా ఉందంటూ గత ఎన్నికల సమయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు దృష్టికి ఆ గ్రామ సర్పంచ్ (టీడీపీ) కె.సందీప్కుమార్ తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన ప్రజలఽ దాహార్తీని తీర్చేందుకు బోరు వేయించి, పంచాయతీకి అప్పగించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సర్పంచ్ ఆగడాలు పెచ్చుమీరాయి. ఈ నేపథ్యంలోనే పబ్లిక్ బోరుకు ప్రత్యేక పైప్లైన్ ఏర్పాటు చేసి అర కిలోమీటరు దూరంలో ఉన్న తన పొలానికి నీటిని మళ్లించుకోసాగారు. ఇందు కోసం పంచాయతీకి సంబంధించిన విద్యుత్ను వినియోగించుకుంటున్నారు. వేసవిలో తాగునీరు అందక ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇటీవల సర్పంచ్ను కలసి సమస్య విన్నవించారు. పబ్లిక్ బోరు నీటిని ప్రజల దాహార్తీని తీర్చేందుకు కేటాయించాలని కోరారు. దీంతో సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ బోరు బావిని తానే వేయించానని బుకాయిస్తూ ‘ఇది మా ప్రభుత్వం... అంతా మా ఇష్టం.. దిక్కున్న చోటుకెళ్లి చెప్పుకోండి’ అంటూ దౌర్జన్యానికి దిగారు. అంతేకాక 24 గంటల పాటు బోరు బావి నీటిని పొలానికి మళ్లించుకుంటూ ప్రజలకు చుక్క నీటిని వదలడం లేదు. జిల్లా అధికారులు స్పందించి తమ తాగునీటి ఇక్కట్లు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.
● టీడీపీ సర్పంచ్ నిర్వాకంతో గ్రామస్తులకు ఇక్కట్లు